హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : సింగరేణి కార్మికుల ఆరోగ్య పరిరక్షణదిశలో సంస్థ కీలక అడుగేసింది. కోల్బెల్ట్ ప్రాంతమైన గోదావరిఖనిలో తొలి క్యాథ్ల్యాబ్ను సంస్థ నెలకొల్పింది. గుండెజబ్బు బాధితులకు గోదావరిఖనిలో అత్యవసర చికిత్స అందిస్తామని, స్టంట్లు వేస్తామని సంస్థ వర్గాలు ప్రకటించాయి. ఈ ల్యాబ్లో రక్తనాళాల పరీక్షల, గుండె నరాల్లో బ్లాక్లను గుర్తించే పరీక్షలు నిర్వహిస్తారు.
గుండెపోటు తీవ్రతను అంచనావేసి, తక్షణ ఉపశమనం కలిగించే యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ చికిత్సలు అందుబాటులో ఉంటాయి. స్టంట్లు కూడా వేస్తారని సింగరేణి వర్గాలు వెల్లడించాయి. అనుభవజ్ఞులైన కార్డియాలజిస్టులు, ప్రత్యేకశిక్షణ పొందిన సిబ్బందితో నిరంతరం సేవలందిస్తామని తెలిపాయి. గోదావరిఖని, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, పెద్దపల్లి, భూపాలపల్లి, మంథని ప్రాంతాల్లోని వారికి, కోల్బెల్ట్ ఏరియాలోని వారికి ఈ క్యాథ్ల్యాబ్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నాయి.