Kamareddy | కామారెడ్డి, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికలు రాకముందే రాష్ట్రంలోని ప్రతిపక్షాలు తట్టాబుట్టా సర్దుకొంటున్నాయి. సీఎం కేసీఆర్తో పెట్టుకొంటే చిత్తుగా ఓడిపోవటం తథ్యమని ముందుగానే సైడైపోతున్నాయి. సీఎం విజయపరంపరను ఎరిగిన కొందరు విపక్ష నేతలు బహిరంగంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. కేసీఆర్కు ఎదురెళ్లటంకంటే పక్క కు తప్పుకోవటం మేలని వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా ఓ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ఎన్నికల్లో సీఎం కేసీఆర్ మీద పోటీ చేసేకన్నా సప్పుడు చేయకుండా ఇంట్లో కూర్చోవడం మంచిదని బీజేపీ కామారెడ్డి ఇన్చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. కామారెడ్డిలోని బీజేపీ కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ మీద పోటీ చేస్తే ఘోర ఓటమితో అవమానం తప్పదన్నట్టుగా చెప్పుకొచ్చారు. కేసీఆర్ గురించి ఎంత చెప్పినా ఒడువదని, ఆయన గురించి చెప్పాలంటే సమయమే సరిపోదని పొగడ్తలతో ముంచెత్తారు.
‘1969 లో తెలంగాణ ఉద్యమం తీవ్రంగా జరిగింది. కొందరు ద్రోహుల వల్ల ఉద్యమం పక్కదారి పట్టింది. 2001 నుంచి కేసీఆర్ నేతృత్వంలో మళ్లీ ఉద్యమం ప్రారంభమైంది. ప్రొఫెసర్ జయశంకర్ సలహాతో ఉద్యమాన్ని నడిపారు. టీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఉద్యమంలో సబ్బండ వర్ణాలను భాగస్వాములను చేశారు. 2014లో తెలంగాణ ఉద్యమం కారణంగా కేంద్రం దిగివచ్చి రాష్ర్టాన్ని ఇచ్చింది. ఆ తర్వాత సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు. ఆయన గురిం చి చెప్పాలంటే సమయం సరిపోదు’ అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మంచి వ్యక్తి అని ప్రశంసించారు. ‘గజ్వేల్లో రోడ్లు, డ్రైనేజీలు, సెంట్రల్ లైటింగ్ అభివృద్ధి చెందినట్టే, కామారెడ్డి నియోజకవర్గంలోని కామారెడ్డి, దోమకొండ, కాచాపూర్, చిన్నమల్లారెడ్డి వంటి ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తుండటంతో కామారెడ్డి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటుచేసే అవకాశం ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 20, 21 పూర్తిచేస్తే కామారెడ్డి నియోజకవర్గంలో మూడు పంటలకు నీరు అందుతుంది’ అని పేర్కొన్నారు.