హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): ఆది నుంచి కాళేశ్వరంపై అక్కసు వెళ్లగక్కుతున్న కాంగ్రెస్ పార్టీ… ఇప్పుడు అధికారం దక్కడంతో ఆ ప్రాజెక్టును అడ్డుపెట్టుకొని గత ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలకు దిగే ప్రయత్నాలు చేస్తున్నది. కాళేశ్వరంలో పుష్కలంగా నీళ్లున్నప్పటికీ రైతులకు ప్రభుత్వం సాగునీళ్లు ఇవ్వడంలో విఫలమవుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో విమర్శల నుంచి తప్పించుకునేందుకు గత ప్రభుత్వంపై ప్రతీకార చర్యలకు ఒడిగడుతున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగా మేడిగడ్డలో అనుకోనివిధంగా జరిగిన ప్రమాదాన్ని బూచిగా చూపుతూ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిష్ఠనే దెబ్బతీసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం.
కాళేశ్వరంపై విజిలెన్స్ తనిఖీల పేరుతో కొన్ని రోజులుగా హంగామా సృష్టించిన విషయం తెలిసిందే. ఈ విజిలెన్స్ నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి అందించనున్నట్టు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. నివేదిక ఆధారంగా త్వరలోనే మేడిగడ్డపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉన్నదని సదరు అధికారి వెల్లడించారు. అయితే నివేదిక ప్రభుత్వానికి అందకముందే తన అనుకూల మీడియాకు లీకులిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం డ్యామేజీ అయినట్టు ప్రచార మొదలుపెట్టింది. తద్వారా ప్రాజెక్టుపై, గత ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేక భావన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.