హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నుంచి విమానాల్లో దేశ, విదేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య ఏటేటా గణనీయంగా పెరుగుతున్నది. దీంతో శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ విమానాశ్రయం నుంచి గత నెల 25న ఒక రోజు 75 వేల మంది దేశ, విదేశాలకు ప్రయాణించడంతో ఈ రికార్డు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. నవంబర్ నెలలో ఆర్జీఐఏ నుంచి మొత్తం 14,462 విమానాల రాకపోకలు జరిగాయని, వీటిలో 20,32,250 మంది ప్రయాణించారని వివరించారు. నిరుడు ఇదే కాలంతో పోల్చితే ప్రయాణికుల సంఖ్య 17% పెరిగినట్టు తెలిపారు.
ఈ ఏడాది నవంబర్ వరకు ఆర్జీఐఏ నుంచి 1.63 కోట్ల మంది ప్రయాణించారని, ఈ సంఖ్య 2022-23 కంటే 22 శాతం ఎక్కువని పేర్కొన్నారు. ఈ ఏడాది నవంబర్లో ఒమన్ ఎయిర్ సంస్థ సరుకు రవాణా విమాన సేవలను ప్రారంభించడంతోపాటు దేశీయ, అంతర్జాతీయ మార్గాలను విస్తరించింది. మరోవైపు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సహకారంతో ఆర్జీఐఏ నుంచి కొత్త సేవలను మొదలుపెట్టారు. దీంతో గత నెల 14న లండన్లో జరిగిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సమ్మిట్లో ఆర్జీఐఏకి ‘సస్టెయినబుల్ ఎయిర్పోర్టు అవార్డు- స్ట్రాటజీ, కల్చర్ అండ్ ఎథోస్’ విభాగంలో ప్రశంసలు దక్కినట్టు అధికారులు తెలిపారు.