హైదరాబాద్ సిటీబ్యూరో/నాంపల్లి కోర్టులు, మే 4 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ ఏఈ పేపర్ లీకేజీ ఘటనలో మరో ఇద్దరు నిందితులను సిట్ గురువారం అరెస్టు చేసింది. దీంతో ఈ కేసులో నిందితుల సంఖ్య 22కు చేరింది. ప్రధాన నిందితులైన ప్రవీణ్కుమార్, రాజశేఖర్రెడ్డి ద్వారా రేణుక, ఢాక్యానాయక్ దంపతులు ఏఈ పేపర్ కొనుగోలు చేసి దానిని బహిరంగ మార్కెట్లో విక్రయించారు. ఢాక్యా బ్యాంకు ఖాతాలో జమ అయిన రూ.1.75 లక్షల గురించి ఆరా తీయడంతో తాజా లింక్ బయటపడింది. కస్టడీలోనే ఈ అంశంపై ఢాక్యాను సిట్ ప్రశ్నించగా.. ఆ డబ్బు స్నేహితుడి వద్ద తీసుకున్నట్టు బుకాయించాడు. కానీ, ఢాక్యా ఖాతాలో డబ్బు డిపాజిట్ చేసిన కోస్గి భగవంత్కుమార్ గురించి ఆరా తీయడంతో లింక్ను గుర్తించారు.
భగవంత్కుమార్.. తమ్ముడు కోస్గి రవికుమార్ కూడా ఏఈ పరీక్ష రాశాడు. ఏఈ పేపర్ను ఢాక్యానాయక్ నుంచి అన్నదమ్ములు కొన్న విషయం బయటపడటంతో సిట్ వారిద్దరి ని అరెస్టు చేసింది. వికారాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్ మైబయ్యతోపాటు కోస్గి భగవంత్కుమార్ పనిచేస్తున్నాడు. అదే జిల్లాలో పనిచేస్తున్న ఢాక్యానాయక్తో పరిచయాలు ఏర్పడ్డాయి.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కోస్గి రవి (ఏ21), కోస్గి భగవంత్కుమార్ (ఏ22) అనే అన్నదమ్ములను సిట్ పోలీసులు అరెస్టు చేసి గురువారం 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపర్చారు. న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్కు తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రశ్నపత్రం కొనుగోలు చేశారని వారిపై సిట్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.