హైదరాబాద్ :మిషన్ భగీరథ పథకంపై నీతి ఆయోగ్ మరోసారి ప్రశంసలు కురిపించడం సీఎం కేసీఆర్ పని తీరుకు నిదర్శనమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య అంశంగా, ప్రతిష్టాత్మకంగా వంద శాతం ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా నీరు అందిస్తున్న మిషన్ భగీరథ పథకానికి ప్రధాన మంత్రి మోదీ అధ్యక్షతన ఉన్న కేంద్ర నీతి ఆయోగ్ మరోసారి ప్రశంసించింది.
సాక్షాత్తూ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ట్విట్టర్ వేదికగా నూటికి నూరు శాతం ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీరు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడు ‘హర్ ఘర్ జల్’ వాస్తవ రూపం దాలుస్తున్నది. దేశంలో తెలంగాణ, గోవా తర్వాత గ్రామీణ ప్రాంతాలకు నల్లాల ద్వారా మంచినీటిని అందించే అతి ముఖ్యమైన లక్ష్యాన్ని సాధించిన మూడో రాష్ట్రంగా హరియాణ కూడా అవతరించింది.
అది కూడా ‘జల్ జీవన్ మిషన్’ వేగమైన లక్ష్యానికి ఓ ప్రేరణ గా నిలిచింది అంటూ ఆయన ట్వీట్ చేశారు. అలాగే, తెలంగాణ రాష్ట్రంలోని 54 లక్షల 6 వేల 70 ఇండ్లకు మిషన్ భగీరథ ద్వారా నల్లాలతో తెలంగాణ రాష్ట్రం తాగునీటిని అందిస్తోంది. ఇది వంద శాతం.
గోవా రాష్ట్రంలో 2 లక్షల 63 వేల 13 ఇండ్లకు, హరియాణ రాష్ట్రంలో 30 లక్షల 96 వేల 792 ఇండ్లకు, పుదుచ్చేరి లో 1 లక్ష 14 వేల 908 ఇండ్లకు తాగు నీటిని అందిస్తూ వంద శాతం లక్ష్యాన్ని చేరుకున్నాయని నీతి ఆయోగ్ వివరించింది.
నీతి ఆయోగ్ రాష్ట్ర మిషన్ భగీరథ పథకాన్ని మరోసారి ప్రశంసించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేవారు. సీఎం కసీఆర్ మేధోమథనం నుంచి ఈ పథకం పురుడుపోసుకుందన్నారు. సీఎం సాధించిన ఈ విజయం దేశానికి ఆదర్శంగా నిలవడం అత్యంత సంతోషకరం అన్నారు.
ఇంత గొప్ప పథకాన్ని రూపొందించి విజయవంతం చేసిన సీఎం కేసీఆర్కు, ప్రశంసించిన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు రాజీవ్ కుమార్ కు రీ ట్వీట్ చేశారు.