KCR | హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ప్రజా తీర్పును గౌరవిద్దామని, కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. రాజ్యాంగబద్ధంగా జనవరి 16 వరకు మన ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉన్నా ప్రజా తీర్పునకు అనుగుణంగా హుందాగా వ్యవహరించి తప్పుకున్నామని స్పష్టం చేశారు. సోమవారం గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి వచ్చిన నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్ అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ఫలితాలపై సమీక్షించారు. ప్రజాతీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించి, ప్రజాసేవకు పునరంకితం కావాలని సూచించారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిద్దామని, ఏమి జరుగుతుందో వేచి చూద్దామని కేసీఆర్ ప్రజాప్రతినిధులకు చెప్పారు.
తెలంగాణ భవన్లో త్వరలో సమావేశమై నూతన శాసనసభాపక్షనేతను ఎన్నుకొందామని తెలిపారు. కేసీఆర్ను కలిసివారిలో ఎమ్మెల్యేలు తన్నీరు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, దానం నాగేందర్, మర్రి రాజశేఖర్రెడ్డి, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి, మాగంటి గోపీనాథ్, కొత్త ప్రభాకర్రెడ్డి, సుధీర్రెడ్డి, కాలే యాదయ్య, కేవీ వివేకానంద్, పాడి కౌశిక్రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, డాక్టర్ సంజయ్, సునీతా లక్ష్మారెడ్డి, లాస్య నందిత, చింతా ప్రభాకర్, ప్రకాశ్గౌడ్, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీలు సత్యవతిరాథోడ్, మహమూద్ అలీ, శంభీపూర్ రాజు, పట్నం మహేందర్రెడ్డి, ఎల్ రమణ, దండె విఠల్, మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాస్గౌడ్, సైదిరెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్రావు, గువ్వల బాలరాజు, బొల్లం మల్లయ్యయాదవ్, సైదిరెడ్డి, పైలట్ రోహిత్రెడ్డి, పద్మా దేవేందర్రెడ్డి, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, వంటేరు ప్రతాప్రెడ్డి, గజ్జెల నగేశ్ తదితరులు ఉన్నారు.
గజ్వేల్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. కాగా, ఇందుకు సంబంధించిన గెలుపు పత్రాన్ని పార్టీ నేత వంటేరు ప్రతాప్రెడ్డి ఈ సందర్భంగా కేసీఆర్కు అందజేశారు.