హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 15 (నమ స్తే తెలంగాణ): నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించి, వారి ప్రాణాలు కాపాడే దేవాలయమని, అందుకే సీఎం కేసీఆర్ నిమ్స్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని దవాఖాన నూతన డైరెక్టర్ డాక్టర్ బీరప్ప నగరి అన్నారు. నిమ్స్ నూతన డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’తో బీరప్ప ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడకముందు పేదలకు అవయవ మార్పిడి అందని ద్రాక్షలా ఉండేదని తెలిపారు. సీఎం కేసీఆర్ అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలను కూడా ఆరోగ్యశ్రీ కిందికి తీసుకురావడంతో ఎంతోమంది రోగులు పునర్జీవం పొందుతున్నాని చెప్పారు. నిమ్స్ ఢిల్లీలోని ఎయిమ్స్కు దీటుగా అభివృద్ధి చెందుతున్నదని అన్నారు.
డైరెక్టర్గా ఎంపికవడం ఎలా అనిపిస్తున్నది?
నేను డైరెక్టర్ అవుతానని ఎన్నడూ ఊహించలేదు. నన్ను నమ్మి బాధ్యతలు అప్పగించినందుకు సీఎం కేసీఆర్కు, మంత్రి హరీశ్రావుకు ప్రత్యేక ధన్యవాదాలు.
నిమ్స్లో వచ్చిన మార్పులు?
తెలంగాణకు ముందు నిమ్స్ పడకల సామర్థ్యం 900. తరువాత పడకల సంఖ్య 1,500కు పెరిగింది. ఇప్పుడు రోజూ ఓపీ రోగుల సంఖ్య దాదాపు 3,500. తెలంగాణ రాకముందు ఏడాదికి సగటున 11,956 శస్త్రచికిత్సలు జరిగేవి. ఇప్పుడు ఏడాదికి 24,945 సర్జరీలు జరుగుతున్నాయి.
నిమ్స్లో ఇప్పుడు బెడ్స్ దొరుకుతున్నాయా?
ఆ పరిస్థితి 2014కు ముందు ఉండే. ఇప్పుడా అలా కాదు. ఎప్పుడూ 3,4 నాలుగు పడకలు అందుబాటులో ఉంటున్నాయి.
నిమ్స్కు ఎన్ని నిధులు కేటాయిస్తున్నారు?
తెలంగాణకు ముందు నిమ్స్కు అతి తక్కువ నిధులు కేటాయించేవారు. తెలంగాణ వచ్చిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు కేటాయిస్తున్నది.
కొత్త భవనం ఎలా ఉంటది?
నిమ్స్ను విస్తరిస్తూ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ.1,571 కోట్లతో 2 వేల పడకల సామర్థ్యం గల భ వనం అదనంగా నిమ్స్కు రాబోతున్నది. కొత్త భవన సముదాయంలో అందుబాటులోకి రానున్న 2 వేల పడకల్లో 500 పడకలు ఐసీ యూ, 1,200 పడకలు ఆక్సిజన్, 300 పడకలు స్పెషల్ రూమ్స్కు కేటాయించారు.
ఓటీలు ఎలా ఉండనున్నాయి?
అత్యాధునికమైన 42 కొత్త మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్ కొత్త భవనంలో అందుబాటులోకి రానున్నాయి. మాడ్యులర్ అంటే జీరో బ్యాక్టీరియా. దీనివల్ల సర్జరీ చేసినప్పుడు ఎలాంటి ఇన్ఫెక్షన్స్కు తావుండదు.
ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏర్పాట్లు ఏమిటీ?
నిమ్స్ కొత్త భవనంలో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్కు పెద్దపీట వేస్తున్నాం. ఒక్కో ఫ్లోర్లో ఒక్కో విభాగం ఉంటుంది. ప్రతి విభాగంలో మెడికల్ అండ్ సర్జికల్ డిపార్ట్మెంట్లు ఉంటా యి. ప్రతి విభాగంలో సంబంధిత ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ విభాగం ఉంటుంది. యూరాలజీ-నెఫ్రాలజీ ఫ్లోర్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విభాగం, కార్డియో ఫ్లోర్లో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ విభాగం ఉంటాయి.
కొత్త విభాగాలు వచ్చాయా?
ఎండ్రోక్రైనాలజీ, హెమటాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, గెరియాట్రిక్ మెడిసిన్, స్టెమ్సెల్ రిసెర్చ్ తదితర 5 విభాగాలు కొత్తగా వచ్చా యి. కొత్తగా 200 పడకలతో ఎంసీహెచ్ భవనం నిర్మిస్తున్నాం. ఇది అందుబాటులోకి వస్తే గైనిక్, స్త్రీ సంబంధిత, చిన్నపిల్లల విభాగాలు అందుబాటులోకి వస్తాయి.
డైరెక్టర్గా మీ కల ఏమిటీ?
ఎయిమ్స్కు దీటుగా సేవలందిస్తున్నది. కానీ, అది సరిపోదు. రాబోయే రోజుల్లో దేశంలోనే కాదు.. విదేశాల్లోని రోగులకు కూడా మెరుగైన వైద్యం అందించేలా ఇంటర్నేషనల్ స్థాయి ఇన్స్టిట్యూట్గా చూడాలనేది నా కల.