Dowry Deaths | హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా రోజుకూ సుమారు 18 వరకట్న మరణాలు సంభవిస్తున్నాయని ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. ఈ మరణాలు ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 6,516 వరకట్న మరణాలు సంభవించగా, వీటిల్లో యూపీ, ఎంపీ, బీహార్ రాష్ర్టాలు ముందున్నాయి. వీటిలో అత్తింటి నుంచి, భర్త నుంచి వేధింపులే అధికంగా ఉన్నాయి. తెలంగాణలో ఈ ఏడాది 137 మరణాలు మాత్రమే నమోదయ్యాయని ఎన్సీఆర్బీ తెలిపింది. తెలంగాణలో మహిళా భద్రత కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉమెన్ సేఫ్టీ వింగ్ సత్ఫలితాలను ఇస్తున్నది.
తెలంగాణవ్యాప్తంగా ఉన్న భరోసా కేంద్రాలు, షీటీమ్స్కు వరకట్న వేధింపులపై వచ్చిన ఫిర్యాదులను సేఫ్టీ వింగ్ చాకచక్యంగా వ్యవహరిస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నది. మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారికి కఠిన శిక్షలు విధిస్తుండటం.. కటకటాల వెనక్కి పంపుతుండటంతో క్రమంగా నేరాలు తగ్గుముఖం పట్టాయి. పని ప్రదేశంలో మహిళలను వేధించేవారికి మూకుతాడు వేసేందుకు ‘సాహస్’ అనే విభాగాన్ని తీసుకొచ్చింది. లైంగిక వేధింపులు అత్యధికంగా జరుగుతున్న రాష్ర్టాల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉన్నాయి. వీటితో పాటుగా లైంగికదాడులు సైతం దేశవ్యాప్తంగా భారీగా పెరిగిపోయాయి. రాజస్థాన్లో 5,399 కేసులు.. ఉత్తరప్రదేశ్లో 3690, మధ్యప్రదేశ్లో 3029, మహారాష్ట్రలో 2904, హర్యానాలో 1787, ఒడిశాలో 1464, జార్ఖండ్లో 1298, ఛత్తీస్గఢ్లో 1246 లైంగికదాడుల కేసులు నమోదయ్యాయి. లైంగికదాడులు తక్కువగా నమోదైన రాష్ర్టాల సరసన తెలంగాణ (814)
నిలిచింది.