Earthquakes | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 5 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భూమి కదులుతున్నది. భూపటలం ఏటా 5 సెంటీమీటర్ల దూరం జారుతున్నట్టు నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) అధ్యయనంలో తేలింది. ఏడాదిలో దేశంలో వచ్చిన భూకంపాలపై అధ్యయనం చేసిన పరిశోధకులు ఆసక్తికర విషయాలను తెలుసుకొన్నా రు. ఇటీవల జోషిమఠ్, హిమాలయ నదీ పరివాహక ప్రాంతాల్లో సంభవించిన భూప్రకంపనలపై నిర్వహించిన అధ్యయనం ఆధారంగా భూపటలం జారిపోతున్నట్టు తేల్చారు. దేశంలో భూకంప ప్రభావిత ప్రాంతాలకు ము ప్పు పొంచి ఉన్నదని గుర్తించారు.
పరిశోధకులు ముఖ్యంగా హిమాచల్, ఉత్తరాఖండ్తోసహా నేపాల్ పశ్చిమ భాగానికి మధ్య భూకంప అంతరంగా పిలిచే ప్రాంతంలో కలుగుతున్న మార్పులపై దృష్టి సారించారు. కొంతకాలంగా భారత టెక్టొనిక్ ప్లేట్లలో మార్పులు వస్తున్నాయని, ఏటా భూపటలం కిందికి జారడంతో భూపొరల మధ్య ఖాళీలు ఏర్పడుతున్నాయని, హిమాలయాల వైపు ఒత్తిడి పెరిగి భూకంపాలు సంభవించేలా భూ పొరల నిర్మాణం ఏర్పడుతున్నదని కనుగొన్నారు.