హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): పట్టణ స్థానిక సంస్థలకు సవాల్గా మారిన కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ (సీఅండ్డీ) వ్యర్థాల సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ వ్యర్థాల వల్ల వాయు కాలుష్యం తలెత్తకుండా చూసేందుకు హైదరాబాద్ తరహాలో జిల్లాల్లోనూ సీఅండ్డీ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ఆదేశాలతో మున్సిపల్ అధికారులు టెండర్లు పిలిచారు.
హైదరాబాద్లో ఇప్పటికే 500 టన్నుల సామర్ధ్యంతో రెండు చోట్ల సీఅండ్డీ యూనిట్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా మంచి ఫలితాలు రావడంతో భవన నిర్మాణాలు అధికంగా జరుగుతున్న వరంగల్, సంగారెడ్డి, నల్లగొండ జిల్లా కేంద్రాల్లోనూ సీఅండ్డీ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో యూనిట్ 70 టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు కానున్నది. సమీప మున్సిపాలిటీల్లోని సీఅండ్డీ వ్యర్థాలను కూడా ఈ యూనిట్లకు తరలిస్తారు. వాటిని ప్రాసెస్ చేసి తిరిగి ఉపయోగించుకునేందుకు వీలయ్యేలా చేస్తారు.