నల్లగొండ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని టీఆర్ఎస్ శ్రేణులకు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన ఏడు సంవత్సరాల కాలంలో అన్ని రైతు వ్యతిరేక విధానాలను తీసుకుందని ఆయన ఆరోపించారు.
ఈ మేరకు మంత్రి జగదీష్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామన్న మోదీ సర్కార్ దళారుల ఆదాయాన్ని మాత్రమే రెండింతలు చేశారని ఆయన దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ చేపట్టిన విధానాల వల్లనే తెలంగాణలో రైతుల ఆదాయం పెరిగింది సుస్పష్టం అని ఆయన చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువులు, డీజిల్,పెట్రోల్ ధరలతో తెలంగాణ రైతు జేబుకు కుడా చిల్లు పడిందన్నారు.
బీజేపీ వైఖరి దొంగే దొంగా..దొంగా అన్న చందంగా మారిందని మంత్రి ఎద్దేవాచేశారు. బాధ్యతాయుతమైన సీఎంగా రైతుల సమస్యలను సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకు వస్తే సమాధానం చెప్పాల్సిన ప్రధాని మోదీ మౌనంగా ఉండి రాష్ట్ర నాయకులతో ఊరకుక్కల్లా మొరిగిస్తున్నారని మంత్రి మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను తమ తాబేదార్లకు కట్టబెడుతూ దేశప్రజలను బీజేపీ ప్రభుత్వం ముంచుతుందని ఆయన ఆరోపించారు. నల్లడబ్బును తెస్తామన్న ప్రధాని ప్రస్తుతం పేద ప్రజల జేబులకు చిల్లులు పడేలా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు.
బీజేపీ మోసపూరిత విధానాల పట్ల దేశ రైతాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువులు, డీజిల్,పెట్రోల్ ధరలు తగ్గించే దాకా ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగం, టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.