కామారెడ్డి, మే 7: కన్న పేగు కోసం జీవితాంతం ఆరాటపడిన ఆ తల్లి చివరకు అనాథగా మిగిలింది. కాసులకు కక్కుర్తిపడి కడుపున పుట్టిన కూతుళ్లే.. మానవత్వం మరిచి తల్లి మృతదేహాన్ని దవాఖానలో వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేం ద్రంలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి పట్టణంలోని ఆర్బీ నగర్ కాలనీకి చెందిన కిష్టవ్వ (70) గత నెల 21న అనారోగ్యంతో ఏరి యా దవాఖానలో చేరింది. కిష్టవ్వకు ముగ్గు రు కూతుళ్లు. అందులో ఒకరు మృతి చెందా రు. మరో ఇద్దరు కూతుళ్లు ఎల్లవ్వ, పెంటవ్వలు దవాఖానలో ఉంటూ ఆమె బాగోగులు చూసుకున్నారు.
కిష్టవ్వ పేరు మీద బ్యాంకులో రూ.1.70 లక్షలు ఉన్నా యి. ఈ డబ్బులకు సంబంధించి కిష్టవ్వ బంధువు నామినీగా ఉన్నాడు. ఆ డబ్బులు తమకు ఇవ్వాలని ఇద్దరు కూతుళ్లు తల్లితో వాగ్వాదానికి దిగారు. కిష్టవ్వ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో కూతుళ్లు ఆమెను దవాఖానలోనే వదిలి వెళ్లిపోయారు. దీంతో కిష్టవ్వకు దవాఖానలో సిబ్బంది ఇన్ని రోజులు సపర్యలు చేశారు. శనివారం రాత్రి ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందింది. దవాఖాన సిబ్బంది కూతుళ్లకు సమాచారం ఇవ్వగా.. తమకు బ్యాంకులో ఉన్న డబ్బులు ఇప్పిస్తేనే మృతదేహాన్ని తీసుకెళ్తామని తేల్చి చెప్పారు. సిబ్బంది చేసేదేమీ లేక మృతదేహాన్ని అక్కడే భద్రపరిచారు. సోమవారం వరకు చూసి మృతదేహాన్ని మున్సిపల్ సిబ్బందికి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.