కేతేపల్లి, జూన్ 5 : నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువ కావడంతో ప్రాజెక్టు డీఈఈ చంద్రశేఖర్ సోమవారం స్విచ్ ఆన్ చేసి నీటిని దిగువకు వదిలారు. ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లో వల్ల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 3వ నెంబరు క్రస్ట్ గేటును అర అడుగు మేర ఎత్తి 330 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.
సోమవారం ఎగువ నుంచి 243.16 క్యూసెక్కుల నీరు వచ్చింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 (4.46 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం 644.60 (4.36 టీఎంసీలు) ఉన్నట్టు అధికారులు తెలిపారు. దిగువకు నీటిని విడుదల చేయడంతో నదిలోకి రైతులు, గొర్రెలు, మేకల కాపరులు, మత్స్యకారులు వెళ్లవద్దని అధికారులు సూచించారు.