జయశంకర్ భూపాలపల్లి, మే 11(నమస్తే తెలంగాణ): మావోయిస్టులకు అందజేసేందుకు తరలిస్తున్న రూ. 76.57 లక్షలను పోలీసులు పట్టుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ జే సురేందర్రెడ్డి గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 10న మహదేవపూర్ రోడ్డులోని కాటారం ఫారెస్ట్ చెక్పోస్టు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా స్కార్పియో వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. తనిఖీ చేయగా, అందులో నలుగురు వ్యక్తులు, పెద్ద మొత్తంలో డబ్బుతోపాటు ఇతర వస్తువులు ఉండటంతో కాటారం పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి విచారించారు.
కరీంనగర్లో నివాసం ఉంటున్న అబ్దుల్ అజీజ్ బీడీ ఆకు కాంట్రాక్టర్. ఇతని వద్ద హుజూరాబాద్కు చెందిన అబ్దుల్ రజాక్ పనిచేస్తున్నాడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా భూపాలపట్నం తాలూకా చందూర్కు చెందిన జనగాం రాఘవ్ గుమస్తాగా, పశ్చిమ బెంగాల్కు చెందిన కౌసర్ అలీ డ్రైవర్గా వద్ద పనిచేస్తున్నారు. 2014 నుంచి అజీజ్ మావోయిస్టులకు వస్తువులను చేరవేస్తున్నాడు.
అబ్దుల్ అజీజ్, ఎండీ అబ్దుల్ రజాక్, జనగామ రాఘవ్, కౌసర్ అలీ పెద్ద మొత్తంలో నగదుతోపాటు కొన్ని వస్తువులు, మందు గుండు సామగ్రిని స్కార్పియో వాహనంలో మావోయిస్టులకు చేరవేసేందుకు ఛత్తీస్గఢ్కు వెళ్తున్న క్రమంలో పోలీసులకు పట్టుబడ్డారని ఎస్పీ తెలిపారు. వారి నుంచి రూ.76.57 లక్షల నగదు, సాంసంగ్ గెలాక్సీ ట్యాబ్, మందులు, సిరప్ సీసాలు, క్యాసియో వాచీలు, న్యూట్రిషన్ పౌడర్, జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, కార్డెక్స్ వైర్, టవళ్లు, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని, బ్లాక్ స్కార్పియోను సీజ్ చేసి సదరు నలుగురిని అరెస్టు చేయగా, ఎనిమిది మంది పరారీలో ఉన్నారు.