యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకున్నది. టీఆర్ఎస్ క్యాంపెయిన్ జో రు పెంచింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలతోపాటు కార్యకర్తలు ఊరూరు పర్యటిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు వివరిస్తున్నారు. వివిధ వర్గాల ప్రజలతో సమావేశమవుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ మోసాలను ఓటర్లకు తెలియజేస్తూ కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి ఓటేస్తామని పలుచోట్ల కులసంఘాల నేతలు మద్దతులు తెలుపుతున్నారు. చౌటుప్పల్లో కార్మిక సంఘాలతో మంత్రి మల్లారెడ్డి సమావేశమయ్యారు. మునుగోడు మండలం కొరటికల్లో దళితుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ అజయ్ పాల్గొన్నారు.
ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. చౌటుప్పల్ మండలంలోని ఆరెగూడెంలో మంత్రి మల్లారెడ్డి సమక్షంలో పలువురు టీఆర్ఎస్ కండువా కప్పుకొన్నారు. నాంపల్లి మండలం మల్లపురాజుపల్లిలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి సమక్షంలో గౌడ సంఘం నాయకులు, నర్సింహులగూడేనికి చెందిన కాంగ్రెస్ లీడర్లు, సంస్థాన్ నారాయణపురం మండలం లచ్చమ్మగూడెంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి సమక్షంలో పలువురు కారెక్కారు. మునుగోడు మండలం జక్కలవారిగూడెంలో వివిధ పార్టీలకు చెందిన 150 మంది యువకులు టీఆర్ఎస్లో చేరారు.
చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం సర్పంచ్ (రాజగోపాల్రెడ్డి అనుచరుడు) ఎలువర్తి యాదగిరి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పిసరి బలవంత్రెడ్డి ఎమ్మెల్యే జీవన్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపుకోసం ఆస్ట్రేలియా నుంచి ప్రత్యేక టీంను ప్రచారం కోసం పంపించనున్నట్టు టీఆర్ఎస్ ఆస్ట్రేలియాశాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్రెడ్డి తెలిపారు. ఆదివారం నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. కేసీఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు తెలిపారు. తామం తా ఎల్లప్పుడు సీఎం కేసీఆర్ వెంటే ఉంటామని యాక్ట్ కన్వీనర్ రవి సాయల తెలిపారు. సమావేశంలో ఝాన్సి, రాకేశ్ లక్కర్సు, వీరేందర్, అనిత, రమేశ్, సుషు త్, శ్రీనివాస్, రుద్ర తదితరులు పాల్గొన్నారు.