Job Vacancies | హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : కేంద్రీయ విద్యాసంస్థల్లో టీచర్ల భర్తీలో మోదీ సర్కార్ నిర్లక్ష్యం చూపుతున్నది. కేంద్రీయ విద్యాలయాల్లో 12,099, నవోదయ స్కూళ్లలో 3,139, సెంట్రల్ వర్సిటీల్లో 6,028 ఖాళీలు ఉన్నట్టు సాక్షాత్తు కేంద్రమే పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది. ఈ పోస్టులను నింపలేదని ఒప్పుకొన్నది. కానీ, ఉద్యోగాల భర్తీకి తాత్సారం చేస్తున్నది. ఒకవైపు రెగ్యులర్ టీచర్లు లేకపోవడంతో కేంద్రీయ విద్యాలయాలు కునారిల్లుతున్నాయి. హైదరాబాద్లోని పికెట్ కేవీలో విద్యార్థులకు వారంలో రెండు రోజులు సెలవులిస్తున్నారు. కాంట్రాక్టు టీచర్లను నియమించి నెట్టుకొస్తున్న స్కూళ్లు అనేకం ఉన్నాయి. పట్టుబట్టి కేవీల్లో పిల్లలను చేర్పించిన తల్లిదండ్రులిప్పుడు కేవీల్లో అడ్మిషన్లు రద్దుచేసుకొని, ఇతర పాఠశాలల్లో చేర్పిస్తున్నారు.
దేశంలో పరిస్థితి ఇలా ఉంటే, రాష్ట్రంలో దానికి పూర్తి భిన్నంగా ఉన్నది. రాష్ట్రంలోని 15 వర్సిటీల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం కామన్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేసింది. పైరవీలకు తావులేకుండా, అత్యంత పారదర్శకంగా ఈ బోర్డు ద్వారా పోస్టులను నింపుతారు. బోర్డు ఏర్పాటు బిల్లును అసెంబ్లీలో ఆమోదించి, గవర్నర్కు పంపించారు. బిల్లును గవర్నర్ తొక్కిపెట్టారు. ఐదు నెలలుగా ఆమోదించకుండా అడ్డుపుల్లలు వేస్తున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే కామన్ రిక్రూట్మెంట్బోర్డు ఏర్పాటు కావడమే కాకుండా వేగంగా పోస్టులను భర్తీచేయవచ్చు. కానీ గవర్నర్ ఆమోదించకపోవడంతో పోస్టుల భర్తీ నిలిచిపోయింది. గవర్నర్ వైఖరిని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ఇటీవలే రాజ్భవన్ను ముట్టడించినా స్పందన లేదు.