మునుగోడు, జూన్ 3: దేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా పాలించడంలో మోదీ సర్కారు అన్ని రంగాల్లో విఫలమైందని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా మునుగోడులో శుక్రవారం జరిగిన సీపీఐ జిల్లా 22వ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎనిమిదేండ్ల పాలనలో వంట గ్యాస్, పెట్రోలు, డీజిల్తో పాటు నిత్యావసరాల ధరలు విపరీతంగా పెంచి సామాన్య జనంపై పెనుభారం మోపిందని ధ్వజమెత్తారు.
ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ కార్పొరేట్, పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్నదని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకులపై ఐటీశాఖ అధికారులతో దాడులు చేయిస్తూ వారిని బీజేపీలో చేర్చుకున్నాక ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. స్వార్థ రాజకీయాల కోసం మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం బీజేపీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. మహాసభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి, జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి విజయలక్ష్మి పాల్గొన్నారు.