హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్కు సభలో మాట్లాడేందుకు అతి తక్కువ సమయం కేటాయిస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ మైక్ను పదేపదే కట్ చేస్తున్నారని, మంత్రులు పదేపదే జోక్యం చేసుకుంటూ ప్రధాన ప్రతిపక్షం వాయిస్ను ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బుధవారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తమకు 30 నిమిషాలు సమయం కేటాయిస్తే.. ఒక్క సభ్యుడు ఉన్న సీపీఐకి గంట, ఎంఐఎంకు 1.30 గంటలు కేటాయించారని తెలిపారు.
బీఆర్ఎస్కు ఇచ్చే సమయంలో 10-15 సార్లు మైక్ కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను ప్రస్తావిస్తామని, అధికార పార్టీని నిలదీస్తామని, అవసరమైతే పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు మీడియా పాయింట్కు పోకుండా ఏనాడూ అడ్డుకోలేదని పేర్కొన్నారు.
ప్రగతిభవన్లో సీఎం ఉండటంలేదు కాబట్టి కంచెలు తొలగించారని, రేవంత్రెడ్డి ఇంటిచుట్టూ కంచెలు ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంగా ఉంటే కాంగ్రెస్ హయం లో నిందలు, శ్వేతపత్రాలు, మోసాలే నినాదాలుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ చిహ్నంలోని మూడు సింహాలు ఎవరు తీసుకొచ్చారని ప్రశ్నించారు. కాకతీయుల పాలన ఏవిధంగా ఉన్నదో అందరికీ తెలుసునని, చెరువులు, వేయిస్తంభాలగుడి, చారిత్రక, వారసత్వ సంపద ఎన్నో ఉన్నాయని గుర్తుచేశారు. చంద్రబాబు అండ్ కో చెప్పినట్టుగా రేవంత్రెడ్డి నిర్ణయాలు అమలు చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్ను తొలగించడాన్ని ముస్లీం వ్యతిరేక చర్యగా భావిస్తున్నామని చెప్పారు. గొల్కొం డ కోటలో జెండాను ఎగురవేయడాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రె స్.. ఢిల్లీలో ఎర్రకోటపై జాతీయజెండాను ఎగురవేసిందని గుర్తుచేశారు. సచివాలయం ఎదురుగా రాజీవ్గాంధీ విగ్రహం ఏర్పాటు నిర్ణయాన్ని విరమించుకోవాలని, అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు గత ప్రభుత్వం అన్నిరకాల ఏర్పాట్లు చేసిందని, విగ్ర హం తయారీకి ఆర్డర్ కూడా ఇచ్చామని వివరించారు. కాంగ్రెస్కు భావదారిద్రం తప్ప మరేమీ లేదని విమర్శించారు. దీనిని ప్రజల భావజాలం మీద, హక్కుల మీద దాడిగానే భావిస్తున్నామని చెప్పారు. దీనిపై విద్యావంతులు, మేధావులు, ఉద్యమకారులు స్పందించాలని ఆయన కోరారు. తెలంగాణతల్లిని అవమానించవద్దని ప్రభుత్వానికి హితవు చెప్పారు.