ఖమ్మం, సెప్టెంబర్ 10: ప్రజలకు ఎలాంటి ఆపద రానివ్వమని, బీఆర్ఎస్ ప్రజల ప్రభుత్వమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని నయాబజార్ ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం ఆయన కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి 1,718 మంది ముంపు బాధితులకు ఒక్కొక్కరికి రూ.8,463 చొప్పున చెక్కులు అందజేసి మాట్లాడారు.
ముంపు బాధితులను ఆదుకోవడానికి రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి రూ.కోటి, తన కోడలు అపర్ణ రూ.50 లక్షలు సమకూర్చినట్టు చెప్పారు. ఆ సొమ్మును నేరుగా కలెక్టర్ ఖాతాలో జమ చేసి ముంపు బాధితులకు అందజేస్తున్నట్టు తెలిపారు. వరదల సమయంలో అప్రమత్తంగా ఉండి ఎలాంటి ప్రాణనష్టానికి తావు లేకుండా జాగ్రత్త వహించినట్టు చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిందని గుర్తుచేశారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన పీఆర్టీయూ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ తదితరులు పాల్గొన్నారు.