హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శనివారం ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్ర మూడో అసెంబ్లీ మొదటి సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. సభలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు సమావేశమై పార్టీ విధివిధానాలు, అభ్యర్థుల ప్రవర్తనా నియమావళి, సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై చర్చిస్తారు.
అక్కడి నుంచి నేరుగా అసెంబ్లీ ముందు ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి, నివాళులు అర్పించి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనున్నది. పార్టీ నుంచి గెలిచిన 39 మంది ఎమ్మెల్యేల్లో పార్టీ అధినేత కేసీఆర్ మినహా (కేసీఆర్ దవాఖానలో ఉన్నారు) అందరూ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా పార్టీ అధినేత కేసీఆరే ఉండాలని ఏకవాక్య తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. అలాగే పార్టీ విప్, పీఏసీ చైర్మన్ వంటి పదవులకు ఎవరిని నియమించాలనే అంశంపై కూడా చర్చ జరిగే అవకాశాలున్నాయి.