హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ప్రజాసమస్యల పరిష్కారమే గీటురాయిగా శాసనసభ సమావేశాలు అపూర్వంగా సాగాయి. ఈ నెల 3న గవర్నర్ ప్రసంగంతో మొదలైన అసెంబ్లీ సమావేశాలు.. ఆదివారం ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదంతో నిరవధికంగా వాయిదా పడ్డాయి. 7 రోజులపాటు 56 గంటల 25 నిమిషాలు సమావేశాలు కొనసాగాయి. ఐదు బిల్లులు సభ ఆమోదం పొందా యి. ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన విజయాల నేపథ్యాన్ని సభానాయకుడు, సీఎం కేసీఆర్ మొదలుకొని అన్ని శాఖల మంత్రులు సభకు కండ్లకు కట్టారు. నిర్వహణ విషయంలో తెలంగాణ శాసనసభ తన రికార్డును తనే తిరగరాసింది.
ఈసారి పార్టీలకు అతీతంగా చర్చించే అవకాశం కల్పించటాన్ని విపక్ష పార్టీల సభ్యులు ప్రశంసించడం విశేషం. గిరిజన బిడ్డల పోడు సమస్య పరిష్కారానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నదని సభానాయకుడు సీఎం కేసీఆర్ ప్రకటించి ఆ వర్గాన్ని అక్కున చేర్చుకొన్నారు. వాల్మీకిబోయ, కాయితపు లంబాడీ సహ 11 కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. సభ్యులు లేవనెత్తిన అనేక అంశాలపై సీఎం కేసీఆర్, మంత్రులు 30 గంటల 43 నిమిషాలపాటు సావధానంగా నివృత్తి చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశాలు అర్ధరాత్రి దాకా కొనసాగాయి. మరోవైపు ఐదు రోజులు జరిగిన శాసనమండలి సమావేశాల్లో వివిధ పద్దులపై సభ్యులు 17 గంటలపాటు చర్చించారు. శాసనమండలి సమావేశాల్లో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక కూడా జరగడం మరో విశేషం. సమావేశాలు సంతృప్తిగా సాగాయని విపక్ష పార్టీల సభ్యులు కితాబు ఇవ్వడం విశేషం.
సమావేశాలు జరిగిన రోజులు : 7 రోజులు
పనిచేసిన గంటల సంఖ్య : 56 .25 గంటలు
మౌఖిక సమాధానాలిచ్చిన ప్రశ్నలు: 38
12వ తేదీన ప్రశ్నలకు సమాధానాలు :12
సభ్యులు లేవనెత్తిన అనుబంధ ప్రశ్నలు :78
సభ్యులు చేసిన ప్రసంగాల సంఖ్య : 41
ప్రభుత్వం స్వీకరించిన తీర్మానాల సంఖ్య: 1
ప్రవేశపెట్టిన బిల్లుల సంఖ్య : 5
సభ ఆమోదం పొందిన బిల్లుల సంఖ్య : 5
శాసనమండలి సమావేశాల తీరు
సమావేశాలు జరిగిన రోజుల సంఖ్య : 5
పనిచేసిన గంటల సంఖ్య : 17 గంటలు
నక్షత్ర ్ర పశ్నలకు సమాధానాలు : 15
12తేదీన నక్షత్ర ప్రశ్నలకు సమాధానాలు : 10
సభ్యులు చేసిన ప్రసంగాల సంఖ్య : 47
ప్రవేశపెట్టిన బిల్లుల సంఖ్య : 5
సభ ఆమోదం పొందిన బిల్లుల సంఖ్య : 5
చేసిన తీర్మానాల సంఖ్య : 1
శాసనసభ, మండలి సమావేశాలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయి. ఐదు బిల్లులను ఆమోదించుకోవటంతోపాటు ఈ సమావేశాల్లోనే మండలికి డిప్యూటీ చైర్మన్ను ఎన్నుకొన్నాం.పార్లమెంట్లో ప్రధాని మొహం చాటేస్తే.. శాసనసభలో సీఎం కేసీఆర్ అన్ని అంశాలపై సమాధానం ఇచ్చారు. సీఎం కేసీఆర్ తన అద్భుత ప్రసంగంతో రాష్ట్ర, దేశ ప్రజలకు గొప్ప సందేశం ఇచ్చారు. ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన సలహాలు సూచనలు పాటిస్తామని చెప్పడం సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం. అసెంబ్లీ సమావేశాల నిర్వహణలోనూ దేశానికి ఆదర్శంగా నిలిచాం. చైర్మన్, స్పీకర్, సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.
-వేముల ప్రశాంత్రెడ్డి, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి