Monsoon | హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాల పురోగమనానికి అనువుగా వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. 24 గంటల్లో అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులపై రుతుపవనాలు విస్తరిస్తాయని పేర్కొన్నది. మరోవైపు పశ్చిమ-నైరుతి దిక్కుల నుంచి వీస్తున్న వేడిగాలుల ప్రభావంతో రాగల మూడు రోజులు ఉష్ణోగ్రతలు యథాతథంగా గరిష్ఠంగానే ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే మూడు రోజుల్లో పొడి వాతావరణం ఉంటుందని, దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల వరకు నమోదవుతాయని తెలిపింది.
హైదరాబాద్తోపాటు చుట్టు పక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 40 డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్లో 41.3 డిగ్రీలు, ఖమ్మంలో 41.4, భద్రాచలం 39, హనుమకొండ 39, హైదరాబాద్ 37.2, మహబూబ్నగర్ 41, మెదక్ 40.6, నల్లగొండ 42.5, నిజామాబాద్లో 40.4, రామగుండంలో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ వివరించింది.