హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ సింగరేణి యాజమాన్యం అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారించిన ద్విసభ్య ధర్మాసనం ప్రతివాదులైన సింగరేణి వర్కర్స్ యూనియన్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. గుర్తింపు సంఘానికి అక్టోబర్లోగా ఎన్నికలు నిర్వహించాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ సింగరేణి యాజమాన్యం అప్పీల్ చేసింది. దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
అక్టోబర్లోగా ఎన్నికలు నిర్వహించాలన్న ఉత్తర్వులను రద్దుచేయాలని కోరడం లేదని, ఆ గడువును పొడిగించాలని మాత్రమే కోరుతున్నామని యాజమాన్యం తరఫు న్యాయవాది చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంతా శాసనసభ ఎన్నికల విధుల్లో తలమునకలయ్యారని, ఈ పరిస్థితుల్లో అక్టోబర్ నాటికి ఎన్నికలను నిర్వహించడం కష్టమని వివరించారు.
ఆరు జిల్లాల్లో 15 యూనియన్లకు 40 వేల మంది కార్మికులు ఉన్నారని, అసెంబ్లీ ఎన్నికల కారణంగా సింగరేణి ఎన్నికల నిర్వహణకు సహకరించలేమని కలెక్టర్లు చెప్పారని తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మరో నెలకు సింగరేణి యూనియన్కు ఎన్నికలు నిర్వహించగలమని హామీ ఇచ్చారు. 15 యూనియన్లల్లో 13 యూనియన్లు ఎన్నికల వాయిదాకు అంగీకరించాయని చెప్పారు. దీనిపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వర్కర్స్ యూనియన్లను ఆదేశించిన కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది.