వరంగల్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): కందకట్ల వెంకటేశ్వర్లుది వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రేలకుంట గ్రామం. ఆయనకు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఇందులో మిర్చి, పత్తి పంటలను సాగు చేస్తున్నారు. రైతుబంధు పథకం లేనప్పుడు ప్రతి సంవత్సరం వానకాలం, యాసంగి పంట పెట్టుబడి కోసం అందిన చోటల్లా అప్పు చేసేవారు. ఒక దశలో తన భూమి పట్టాదారు పాస్పుస్తకాలను కుదువపెట్టి వడ్డీ వ్యాపారుల నుంచి అప్పు తీసుకున్నారు. నూటికి నెలనెలా రూ.2కు పైగా వడ్డీ చెల్లించాలని వడ్డీ వ్యాపారులు డిమాండ్ చేయడంతో వ్యవసాయ మార్కెట్లోని ఓ అడ్తీదారును సంప్రదించారు.
ఆయన వద్ద రూ.2 వడ్డీకి అప్పు చేశారు. ఎరువులు, పురుగు మందులు, ఇతర ఖర్చుల కోసం ఏటా అడ్తీదారుకు దాదాపు రూ.10 వేలకుపైగా వడ్డీ రూపంలో చెల్లించారు. అగ్రిమెంటు ప్రకారం తన పంట ఉత్పత్తులను పెట్టుబడి కోసం అప్పు ఇచ్చిన అడ్తీదారు వద్దే అమ్మారు. పంటలకు ఎక్కువ ధర ఇస్తామంటూ ఇతర అడ్తీదారులు ముందుకొచ్చినా.. ఒప్పందం మేరకు తనకు అప్పు ఇచ్చిన అడ్తీదారు వద్దే తక్కువ ధరకు అమ్ముకున్నారు. ఇలా వడ్డీతోపాటు ధర విషయంలోనూ వెంకటేశ్వర్లు నష్టాలు చవిచూశారు.
దీంతో ఒక దశలో ఆయనకు వ్యవసాయంపై విరక్తి కలిగింది. వ్యవసాయం మానేద్దామనే ఆలోచనకు వచ్చిన తరుణంలోనే సీఎం కేసీఆర్ 2018లో రైతుబంధు పథకం ప్రవేశపెట్టారు. రైతుబంధు కింద కందకట్ల వెంకటేశ్వర్లుకు ఏడాదికి రూ.40 వేలు వస్తున్నది. దీంతో ఆయన కష్టాలకు చెక్ పడింది. పంట పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులు, అడ్తీదారులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా పోయింది. రైతుబంధు డబ్బులు తన బ్యాంక్ ఖాతాలో జమ కాగానే ఎరువులు, మందులు కొనుగోలు చేస్తున్నారు.
పండిన పంటను ఎక్కడ ఎక్కువ ధర లభిస్తే అక్కడ అమ్ముకుంటున్నారు. ఇప్పుడు పంట పెట్టుబడిపై ఆయనకు ఆందోళన లేదు. పాస్బుక్కులు కుదువపెట్టాల్సిన అవసరం లేదు. రైతుబంధు పథకం వచ్చినప్పటి నుంచి వ్యవసాయంపై భరోసా ఏర్పడిందని, ధీమాతో పంటల సాగు చేసుకుంటున్నానని వెంకటేశ్వర్లు చెప్తున్నారు. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
మాకు నాలుగు ఎకరాల భూమి ఉన్నది. పంటల పెట్టుబడికి వ్యాపారస్తుల వద్ద అప్పు చేసేవాళ్లం. బోరు బావు కింద సాగు చేసేటోళ్లం. గతంల కరంటు సక్రమంగా ఉండక ఎవుసంలో ఎప్పుడూ నష్టాలే వచ్చేవి. నేను ఎంఏ తెలుగు, బీఎడ్ పూర్తి చేశా. ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నా. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ రైతులకు కలిసొచ్చింది. అటు ప్రైవేట్ లెక్చరర్గా పని చేస్తూనే నాలుగు ఎకరాలు సాగు చేస్తున్నా. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న మా అల్లుడు కూడా మాకు తోడుగా నాట్లు వేసేందుకు వచ్చాడు.
– దీకొండ శేఖర్, తిమ్మాపూర్, జగిత్యాల మండలం
నాకు నాలుగు ఎకరాలు పొలం ఉన్నది. దానిని సాగు చేయాలంటే చేతిలో చిల్లిగవ్వ లేక బ్యాంకులు, తెలిసిన వారి వద్దకు అప్పు కోసం తిరిగేది. రోజుల తరబడి తిరిగినా అప్పు దొరికేది కాదు. ఇప్పుడు ఆ రంది లేదు. కేసీఆర్ సారు రైతుబంధు డబ్బులు ఇస్తుండు. విత్తనాలు, పురుగుమందులు, కూలీలకు ఆ డబ్బులే ఇస్తున్న. ఈ సారి వచ్చిన డబ్బులతో ఏ రందీ లేకుండా యాసంగి సాగు పనులు మొదలెట్టాం. టీవీల్లో కేసీఆర్ డబ్బులు వస్తున్నాయంటేనే చాలా సంతోషంగా ఉండేది. రైతుల గురించి ఆలోచించే కేసీఆర్ సారు పది కాలాల పాటు సల్లగుండాలె.
-సంగ రాధ, మహిళా రైతు, కోయగూడెం గ్రామం, టేకులపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అప్పట్ల మందులు, విత్తనాలు కొనాలంటే మస్తు ఇబ్బంది అయితుండె. ట్రాక్టర్ ఓనర్కు, మందుల దుకాణంల బతిమిలాడి ఉద్దెర తీసుకునేటోళ్లం. ఉద్దెర కాబట్టి అసలు ధర కంటే కొంత ఎక్కువనే తీసుకునే వారు. ఇప్పుడు అట్లలేదు. కేసీఆర్ సార్ వల్ల ఎవరినీ బతిమిలాడే అవసరం లేదు. సమయానికి రైతుబంధు డబ్బులు చేతికి వస్తున్నాయి. మందుల దుకాణంలో నెట్ క్యాష్ ఇచ్చేస్తున్నాం. ఉద్దెర అడుగుతలేమని తక్కువ ధరకే మందులు ఇస్తున్నరు. నగదు ఇస్తున్నామని ట్రాక్టర్ వాళ్లు పోటీపడి వస్తున్నరు.
– పరుచూరి శ్రీనివాసరావు, రైతు, ఆంధ్రానగర్, నందిపేట్ మండలం, నిజామాబాద్ జిల్లా
నాకు మూడెకరాల భూమి ఉన్నది. రూ.15 వేల రైతుబంధు సాయం అందింది. నాటు కూలి పోగా మిగతావాటితో ఎరువులు కొన్నాను. యాసంగి వ్యవసాయ పనులకు రైతుబంధు డబ్బులు టైముకు రావడం సంతోషంగా ఉన్నది. సీఎం కేసీఆర్ చేస్తున్న సాయానికి రుణపడి ఉంటాం. గతంలో పాలకులు రైతాంగానికి సమయానికి కరెంటు ఇవ్వకపోయేది. నీళ్లు సరిగా లేక ఇబ్బందులు పడేవాళ్లం. ఇప్పుడు సీఎం కేసీఆర్ కరంటుతోపాటు రైతుబంధు సాయం చేస్తుండటంతో తిప్పలు తప్పినయ్.
– చింతపట్ల సోమేశ్వర్రావు, రైతు, పర్వతగిరి, వరంగల్ జిల్లా
వానకాలం, యాసంగిలో సీఎం కేసీఆర్ రైతుబంధు ద్వారా అందిస్తున్న పంట పెట్టుబడులు అక్కరకు వస్తున్నాయి. అప్పులు చేసే బాధ తప్పింది. గతంలో అప్పులు తెచ్చి ఆరుగాలం కష్టించి పండించినా పంటలు ఇండ్లకు చేర్చుకునే పరిస్థితి ఉండేది కాదు. కల్లాల్లోనే అప్పులిచ్చిన వ్యాపారులకు అప్పగించేవాళ్లం. సీఎం కేసీఆర్ రైతులకు పంట పెట్టుబడులు ఇవ్వడం, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటం సంతోషంగా ఉన్నది. దళారీల బాధ తప్పింది. ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– గంట్ల రంగారెడ్డి, రైతు, మరిపెడ, మహబూబాబాద్ జిల్లా
గతంలో పంట పెట్టుబడికి అవస్థలు పడేవాళ్లం. ఇప్పుడు రైతుబంధుతో సీఎం కేసీఆర్ సాయం చేస్తున్నడు. అ పైసలతో పొలం పనులు చేస్తున్నం. అప్పుల తిప్పలు తప్పినయి. పంట సాగు చేసే సమయానికి డబ్బులు అందుతున్నాయి. వ్యవసాయం రైతులకు లాభసాటిగా మారింది. సీఎం కేసీఆర్ ఉన్నన్ని రోజులు వ్యవసాయం పండుగే.
– ఆంగోతు రమేశ్, రైతు.తూటిపేటతండా, నల్లగొండ జిల్లా