యాదగిరిగుట్ట, మార్చి18 : అరుణాచల్ప్రదేశ్లోని పర్వత ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో మృతి చెందిన ఈఎంఈ అరుణాచల్ప్రదేశ్ లెఫ్ట్నెంట్ కర్నల్ ఉప్పల వినయ్ భానురెడ్డి అంత్యక్రియలు శనివారం అశ్రునయనాల మధ్య ముగిశాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండల కేంద్రంలో వినయ్ భానురెడ్డి నివాసానికి చేరుకున్న విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ఆర్మీ అధికారులు, కలెక్టర్ పమేలా సత్పతి తదితరులు ఆయన భౌతిక కాయం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. మద్రాస్ రెజిమెంటల్ కర్నల్ అమిత్షా నేతృత్వంలో 30 మంది ఆర్మీ అధికారులు ఆర్మీ డ్రిల్ నిర్వహించారు. అనంతరం ఇంటి నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర 2 కిలో మీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ క్షేత్రం వరకు కొనసాగింది. భానురెడ్డి అమర్ రహే.. వందేమాతరం.. భారత్ మాతాకీ జై.. అంటూ పెద్ద ఎత్తున నినదించారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు హిందూ సంప్రదాయాన్ని పాటించారు.
సైనిక లాంఛనాల ప్రకారం మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. భానురెడ్డి తండ్రి ఉప్పల నర్సింహారెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించగా, ఆయన వెంట భానురెడ్డి భార్య స్పందనారెడ్డి, ఇద్దరు కూతుళ్లు హనికారెడ్డి, హరివికారెడ్డి ఉన్నారు. అనంతరం తండ్రి నర్సింహారెడ్డి భానురెడ్డి చితికి నిప్పంటించారు. అంత్యక్రియల్లో మంత్రితోపాటు జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, భువనగిరి, నకిరేకల్, మల్కాజిగిరి ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, మైనంపల్లి హనుమంతరావుతోపాటు ఆర్మీ అధికారులు, జవాన్లు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.