హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): ఐఐటీల్లో వచ్చే విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తుల స్వీకరణ గడువు ఆదివారంతో ముగియనున్నది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఫీజు చెల్లించవచ్చు. ఏప్రిల్ 29న జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల కాగా, 30 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ను ఐఐటీ గుహవాటి నిర్వహిస్తున్నది. 2.50 లక్షల మంది విద్యార్థులు అడ్వాన్స్డ్కు అర్హత సాధించారు. వీరిలో జనరల్లో 98,612 మంది, వికలాంగులు 2,685 మంది, ఈడబ్ల్యూఎస్లో 25,057 మంది, ఓబీసీల్లో 67,613 మంది, ఎస్సీల్లో 37,536 మంది, ఎస్టీల్లో 18,752 మంది ఉన్నారు.
ఈ నెల 29న అడ్మిట్కార్డులు విడుదలకానుండగా, జూన్ 4న అడ్వాన్స్డ్ ఎగ్జామ్ జరుగుతుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2:30 నుంచి సా యంత్రం 5.30 వరకు పేపర్-2కు పరీక్షలు జరుగుతాయి. ప్రాథమిక సమాధానాల కీని జూన్ 11న, ఫలితాలను అదేనెల 18న విడుదల చేస్తారు. రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, ఆదిలాబాద్, కొత్తగూడెం, మహబూబ్నగర్, నల్లగొండ, నిజామాబాద్, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు.