హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అతిపెద్ద వార్ మెమోరియల్ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్, టూరిజం మంత్రి శ్రీనివాస్గౌడ్, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కొరియన్ యుద్ధంలో దక్షిణ కొరియా త్రివిధ దళాలు ఉపయోగించిన యుద్ధ విమానాలు, ట్యాంకర్లు, జలాంతర్గాములు, ఇతర యుద్ధ సామగ్రితో రాజధాని సియోల్లో ఏర్పాటు చేసిన వార్ మెమోరియల్ పార్క్ను మంత్రులు సోమవారం పరిశీలించారు.
అనంతరం మాట్లాడుతూ.. యువతలో దేశభక్తిని పెంపొందించేందుకు దక్షిణ కొరియా తరహాలో సాయుధ దళాల సహకారంతో అతిపెద్ద వార్ మెమోరియల్ను ఏర్పాటు చేయాలని కేసీఆర్ యోచిస్తున్నారని, అందులో భాగంగానే దక్షిణ కొరియాలోని పర్యాటక ప్రదేశాలను అధ్యయనం చేస్తున్నట్టు తెలిపారు. పర్యాటక శాఖ ఎండీ మనోహర్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.