హైదరాబాద్, ఫిబ్రవరి24 (నమస్తే తెలంగాణ): నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో కులం పేరిట చేసిన దాడి అత్యంత అమానవీయమైనదని బాలల హకుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్చంద్రబోస్ మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన కొందరు బీసీ వర్గానికి చెందిన కుటుంబాన్ని ఆలయంలోకి రానివ్వకపోవడమేగాక, ఈ ఘటనలో రెండునెలల పాప మృతిచెందడం దారుణమని నిప్పులు చెరిగారు. ప్రభుత్వం తక్షణం స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని, నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కుమ్మెర గ్రామ ఘటనను తెలంగాణ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, న్యాయవాది ఉపేంద్ర తీవ్రంగా ఖండించారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్కు ఫిర్యాదు చేశారు. బీసీ సామాజికవర్గ కుటుంబంపై దాడికి పాల్పడిన వారిపై, వారికి వత్తాసు పలుకుతున్న పోలీసు, ఇతర అధికారులపై కఠిన చర్యలను తీసుకోవాలని కోరారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు.