చేర్యాల, జనవరి 22: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న పుణ్యక్షేత్రం పసుపుమయంగా మారింది. హైదరాబాద్ యాదవ సంఘం ఆధ్వర్యంలో కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి క్షేత్రంలో సోమవారం పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా పంచవర్ణాలతో పెద్దపట్నం తయారుచేసిన నిర్వాహకులు.. తర్వాత పంచ పల్లవాలు (ఐదు రకాల మామిడి, జువ్వి, రాగి, మేడి, మర్రి)ల కట్టెలను వరుసుగా పేర్చి అగ్నిగుండంగా మార్చారు.
స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి పెద్దపట్నం, అగ్నిగుండం వరకు తీసుకొచ్చి పూజలు నిర్వహించారు. పెద్దపట్నం, అగ్నిగుండాలను దాటిన తర్వాత భక్తులు స్వామివారి ఆలయంలోకి ప్రవేశించి మల్లికార్జున స్వామి, బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలను దర్శించుకున్నారు. శివసత్తులు, ఘనాచార్యులకు ఆలయ ఈవో బాలాజీ, ఆలయ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి, కమిటీ సభ్యులు కండువా, జాకెట్ ముక్కలతోపాటు స్వామివారి బండారిని పంపిణీ చేశారు.