‘కాశ్యాన్తు మరణాన్ ముక్తిః.. ’ అంటే కాశీ (వారణాసి)లో మరణిస్తే ముక్తి లభిస్తుందని అంటారు. అయితే, అదే కాశీలో ఏండ్లుగా బతుకుతున్న రైతన్న.. ‘ముక్తి కోసం కాదు.. మా సాగు భూముల కోసం మరణానికైనా సిద్ధమే’నని అంటున్నాడు.
పరమశివుడు నివసించిన మహిమాన్వితమైన కాశీ క్షేత్రంలో అన్నదాత అవస్థలపాలవుతున్నాడు. అన్నపూర్ణ దేవి కొలువైన నేలలో.. దేశానికి అన్నంపెట్టే అదే రైతన్న కంట కన్నీరు కారుతున్నది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో.. పరిహారం ఇవ్వకుండా రైతుల సాగు భూములను బీజేపీ సర్కారు గుంజుకొంటుండటమే దీనికి కారణం.
Varanasi | హైదరాబాద్, అక్టోబర్ 9 (స్పెషల్టాస్క్బ్యూరో-నమస్తే తెలంగాణ): ఉత్తరప్రదేశ్లోని వారణాసి, పరిసర ప్రాంత రైతులకు పెద్ద కష్టం వచ్చిపడింది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలను రాకెట్ వేగంతో మొదలుపెట్టాలని అక్కడి బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో రూ. 450 కోట్లతో రాజాతలాబ్లోని గంజారీ గ్రామంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించాలనుకొన్నది. దీనికి గత నెలలో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. అలాగే, వారణాసి ఎయిర్పోర్ట్ విస్తరణ, ట్రాన్స్పోర్ట్ నగర్లో ఎక్స్ప్రెస్వేలు, మాల్స్ను నిర్మించడానికి ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. దీనికోసం వేల ఎకరాల్లో భూములను సేకరించాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం భూసేకరణకు సిద్ధమైంది. వారణాసి పరిసర గ్రామాల్లోని వేల ఎకరాలను సేకరించడంలో భాగంగా రైతులకు నోటీసులు ఇచ్చింది. నిబంధనలకు లోబడి పరిహారాన్ని చెల్లిస్తామని నమ్మబలికింది.
ప్రభుత్వం పరిహారం ఇస్తామనడంతో రైతులు తమ సాగు భూములను ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అయితే, 70-80 ఏండ్ల నుంచి ఆయా భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన రికార్డులు సరిగ్గా ఉంటేనే పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం మెలిక పెట్టింది. పత్రాలన్నీ సరిగ్గా ఉంటేనే ఆయా భూములకు యజమానులుగా రైతులను గుర్తిస్తామని, లేకపోతే వాటిని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొంటుందని హెచ్చరించింది. అంతేకాదు.. బుద్ధుడి బోధనలను నేర్పించే బుద్ధవిహార్కు చెందిన 80 ఎకరాలను, గాంధేయవాదాన్ని ప్రబోధించే సర్వసేవా సంఘ్కు చెందిన 8.7 ఎకరాలను సేకరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆయా ట్రస్టులకు నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వ ఏకపక్ష వైఖరిపై అన్నదాతలతో పాటు ట్రస్టు సభ్యులు మండిపడుతున్నారు. తగిన పరిహారాన్ని ఇవ్వాలని, లేకపోతే భూములను ఇవ్వమని స్పష్టంచేస్తున్నారు.
మా తాతలు ఈ భూమిని 1950లో కొనుగోలు చేశారు. తొలినాటి యజమానులు ఇప్పుడు బతికిలేరు. అయితే, వెరిఫికేషన్ పేరిట ప్రభుత్వం వారిని తీసుకురావాలని అంటున్నది. అదెలా సాధ్యం? ఇప్పుడు మా సాగు భూములను బంజరు భూముల పేరిట స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమైంది.