హైదరాబాద్ : కంటి సమస్యతో బాధపడుతున్న వారికి కంటి వెలుగు ఒక వరం లాంటిదని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధి గన్ బజార్ లో శుక్రవారం కంటి వెలుగు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్రాల్లో చేపట్టని విధంగా తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగును ప్రారంభించిందని పేర్కొన్నారు. వంద రోజుల పాటు నిర్వహించే కంటి వెలుగును గ్రామాలు, బస్తీలు, కాలనీలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమస్య ఉన్న వారికి ఉచితంగానే పరీక్షలు, మందులు, కళ్ళద్దాల పంపిణీ చేస్తుందని వెల్లడించారు.
ప్రతి ఒక్కరికి కంటిచూపు ప్రధానమైనదని తెలిపారు. అంధత్వం లేని రాష్ట్రాంగా తీర్చిదిద్దడానికి కిందిస్థాయి వరకు కంటి వెలుగును తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు ఇచ్చిన వరం కంటి వెలుగు అని అన్నారు. కంటి వెలుగు కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 250 కోట్లు ఖర్చుపెడుతుందని తెలిపారు. వయస్సుతో పని లేకుండా ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలను చేయించుకోవాలని సూచించారు.
కళ్ల ఆపరేషన్ అవసరమున్న వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామని వెల్లడించారు. కంటి పరీక్షలు చేయించుకున్న వారు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారని మంత్రి తెలిపారు.