హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఎండల తీవ్రత మళ్లీ పెరిగింది. మంగళవారం పలు జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆది, సోమవారాలతో పోలిస్తే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగినట్టు హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. బుధ, గురువారాల్లో కొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత ఎకువగా ఉంటుందని, 2-3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. వడగాడ్పుల ముప్పు కూడా పొంచి ఉన్నట్టు తెలిపారు. మంగళవారం అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గరిమెల్లపాడులో 44.2 డిగ్రీలు, ములుగు, నల్లగొండ, నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లోని అనేక మండలాల్లో 43 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 41 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు రికార్డయినట్టు తెలిపారు.
నిరుడితో పోలిస్తే ఈ ఏడాది అధిక వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. నైరుతి రుతుపవనాల సీజన్ (జూన్- సెప్టెంబర్)లో సాధారణం కంటే ఎకువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఆగస్టు-సెప్టెంబర్ మధ్యలో లానినా ప్రభావంతో ఎకువ మోతాదులో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. దేశంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం (1970-2020) 87 సెంటీ మీటర్లు కాగా, ఈ ఏడాది 106 శాతం అధికంగా (సుమారు 92 సెం.మీ.) వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.
దశాబ్దకాలంలో ఐఎండీ వార్షిక తొలిదశ అంచనాల్లోనే సాధారణం కన్నా అధిక వర్షపాతాన్ని ప్రకటించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఎల్నినో పరిస్థితులు బలహీనపడుతున్నాయని ఐఎండీ వెల్లడించింది. నైరుతి ప్రారంభం నాటికి వాటి ప్రభావం మరింత తగ్గుముఖం పడుతుందని తెలిపింది. సాధారణ వర్షపాతానికి 29 శాతం, సాధారణం కంటే ఎకువ వర్షపాతానికి 31 శాతం, అధిక వర్షపాతానికి 30 శాతం అవకాశమున్నట్టు అంచనా వేసింది. ఐఎండీ ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.