Telangana | హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల వినియోగానికి సంబంధించిన తాత్కాలిక ఒప్పందాన్ని దీర్ఘకాలంపాటు కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఏపీ పదే పదే ట్రిబ్యునల్ను ఆశ్రయిస్తున్నదని తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ వాదనలను పరిగణనలోకి తీసుకోవద్దని, కేంద్ర ప్రభుత్వం జారీచేసిన కొత్త మార్గదర్శకాల మేరకు వెంటనే విచారణ చేపట్టాలని ట్రిబ్యునల్కు విజ్ఞప్తి చేసింది. ఏపీ పునర్విభజన చట్టం-2014లోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా రెండు తెలుగు రాష్ర్టాలకు కృష్ణా జలాలను కేటాయించాలని గతంలో కేంద్ర ప్రభుత్వం బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్కు మార్గదర్శకాలను జారీ చేసింది. కానీ, ఆ మార్గదర్శకాలతో తెలంగాణకు ఒరిగేదేమీ లేదని, అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం-1956లోని సెక్షన్ 3 ప్రకారం ఈ అంశంపై విచారణ జరిపే అధికారాన్ని ట్రిబ్యునల్కు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం చాలాకాలం నుంచి డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
దీంతో ఎట్టకేలకు దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్కు కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. వాటిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ ప్రభుత్వం బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. దీనిపై కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-2 చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్రెడ్డి, జస్టిస్ తలపాత్ర బుధవారం ఢిల్లీలో విచారణ చేపట్టారు. ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది జయదీప్గుప్తా వాదన వినిపిస్తూ.. కేంద్రం జారీచేసిన కొత్త మార్గదర్శకాలపై తమకు అభ్యంతరాలున్నట్టు తెలిపారు. గోదావరి జలాల వివాదాల ట్రిబ్యునల్ ద్వారా జరగాల్సిన గోదావరి నీటి మళ్లింపు అంశాన్ని కృష్ణా ట్రిబ్యునల్ విచారణలో చేర్చారని, దీనికి సంబంధించి కేంద్రం విడుదల చేసిన గెజిట్పై ఇప్పటికే సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో కొత్త గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం విచారణ కొనసాగించవద్దని కోరారు.
ఏపీ వాదనలపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదన వినిపిస్తూ.. సెక్షన్-89 ప్రొసీడింగ్స్ ప్రకారం తుది వాదనలను కొనసాగించడం సరికాదని పేర్కొన్నారు. చాలా కాలంపాటు పోరాడి కేంద్రం నుంచి కొత్త మార్గదర్శకాలను జారీ చేయించుకున్నామని, వాటి ప్రకారం వెంటనే విచారణ ప్రారంభించాలని ట్రిబ్యునల్ను కోరారు. 811 టీఎంసీల పంపిణీలో జాప్యం చేసి తాత్కాలిక ఒప్పందాన్ని కొనసాగించాలన్న దురుద్దేశంతో ఏపీ పదే పదే అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నదని ధ్వజమెత్తారు. అనంతరం తదుపరి విచారణను నవంబర్ 22, 23 తేదీలకు వాయిదా వేస్తున్నట్టు ట్రిబ్యునల్ చైర్మన్ ప్రకటించారు. అప్పటిలోగా కొత్త మార్గదర్శకాలపై అభ్యంతరాలను తెలియజేయాలని, అందుకు సంబంధించిన కాపీని నవంబర్ 15లోగా తెలంగాణకు అందజేయాలని ఏపీని ఆదేశించిన జస్టిస్ బ్రిజేశ్కుమార్.. ఏపీ వాదనలపై అభ్యంతరాలను తెలియజేయాలని తెలంగాణకూ సూచించారు.