హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ పోలీసుశాఖ చేపట్టిన వినూత్న చర్యల ఫలితంగా 2023లో జీవిత ఖైదు శిక్షల శాతం భారీగా పెరిగింది. నేరం జరిగిన తర్వాత సాక్ష్యాధారాలను పోలీసులు పకడ్బందీగా సేకరించి, సరైన సమయంలో కోర్టుకు సమర్పించడంతో ఆయా కేసుల్లో శిక్షల రేటు పెరిగింది. 2023లో 141 హత్య కేసుల్లో 206 మందికి కోర్టులు జీవితఖైదు విధించాయి. ఓ హత్యాయత్నం కేసులో ఒకరికి జీవిత ఖైదు, మర్డర్ ఫర్ గెయిన్ విభాగంలోని పది కేసుల్లో 13 మందికి జీవిత ఖైదు పడింది. 73 రేప్ కేసుల్లో 84 మందికి జీవిత ఖైదు పడింది.
ఈ కేసులను భరోసా కేంద్రాలు స్వీకరించి, బాధితుల నుంచి పక్కా ఆధారాలు సేకరించి, లైంగికదాడి కేసుల్లో నిందితులకు సత్వర శిక్షలు పడేలా కృషిచేశాయి. ఇక ఎన్డీపీఎస్ కేసుల్లో 52 మందికి ఏడాది నుంచి 20 ఏండ్ల లోపు శిక్షలు విధించారు. కొందరికి జరిమానాలు కూడా పడ్డాయి. 11 ఎస్సీ ఎస్టీ కేసుల్లో 24 మందికి జీవిత ఖైదు, ఓ కేసులో ఒకరికి 20 ఏండ్లు శిక్షను న్యాయమూర్తి విధించారు. ముఖ్యంగా మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి 65 కేసుల్లో 73 మందికి జీవితఖైదు విధించారు. 2020లో మహబూబాబాద్లో నమోదైన చిన్నారి దారుణ హత్య కేసులో మందాసాగర్ అనే వ్యక్తికి మరణ శిక్ష విధించారు. 87 పోక్సో కేసుల్లో 104 మందికి వివిధ రకాల శిక్షలు విధించగా.. 34 కేసుల్లో 41 మందికి జీవితఖైదు విధించారు.