వేములవాడ రూరల్, డిసెంబర్ 30: ఒరిజినల్ ఆధార్ కార్డు లేదని బస్సులో ప్రయాణిస్తున్న యువతిని ఓ కండక్టర్ మధ్యలోనే దింపేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగింది. బాధితులవివరాల ప్రకారం.. వేములవాడకు చెందిన జాస్విని హైదరాబాద్లో బీటెక్ చదువుతున్నది. ఇటీవలే ఇంటికి వచ్చిన ఆమె.. హైదరాబాద్ వెళ్లేందుకు శనివారం మధ్యాహ్నం వేములవాడలో బస్సు ఎక్కింది. వేములవాడ పట్ట ణం దాటిన తర్వాత ఐదు కిలోమీటర్ల దూరంలో కండక్టర్ ఆ యువతిని ఆధార్కార్డు చూపించాలని అడగ్గా.. తన దగ్గర ఉన్న చిన్న ఆధార్కార్డును చూపించింది.
ఒరిజనల్ ఆధార్కార్డు ఉండాల్సిందేనని, లేదంటే దిగిపోవాలంటూ మధ్యలోనే బస్సు ఆపి దింపేశాడు. దీంతో ఆ యువతి తండ్రి రాజిరెడ్డికి ఫోన్ చేయగా, వెంటనే ఆయన అక్కడికి చేరుకొని యువతితో కలిసి డిపోకు వెళ్లి డీఎంకు ఫిర్యా దు చేశారు. డీఎం మురళీకృష్ణ సైతం కండక్టర్కు వంతపాడుతూ ఒరిజినల్ ఉండాలని తమకు ఆదేశాలున్నాయని, తమ డ్యూటీ తాము చేస్తున్నామని యువతి తండ్రితో వాగ్వాదానికి దిగారు. కనీసం ఆడపిల్ల అని చూడకుండా మధ్యలోనే దింపివేయడం సరికాదని అక్కడ ఉన్న పలువురు ప్రయాణికులు సైతం డీఎంను నిలదీశారు. ఉచిత ప్రయాణమని చెప్పి ఇలా ఇబ్బంది పెట్టడంపై ఏంటని మండిపడ్డారు.