జడ్చర్ల టౌన్, జనవరి 8: చెడు వ్యసనాలకు అలవాటుపడిన ఓ వ్యక్తి కన్న బిడ్డలను ఎత్తుకెళ్లి అమ్మేందుకు యత్నించిన ఘటన సోమవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో వెలుగు చూసింది. భూత్పూరు మం డలం తాడిపర్తికి చెందిన రఫీక్, హబీబున్నీసా దంపతులకు ముగ్గురు సంతానం. వీరు జడ్చర్లలో నివాసం ఉంటున్నారు. రఫీక్ చెడు వ్యసనాలకు బానిస కావడంతో నెలల తరబడి ఇంటికి రాకుండా వివిధ ప్రాంతాల్లో తిరిగేవాడు. భార్యాపిల్లలను తరచూ వేధించేవా డు. ఆదివారం మధ్యాహ్నం భార్యతో గొడవపడ్డాడు. ఆ తరువాత తన ముగ్గురు పిల్లలు రుమానాబేగం (7), రమీజ్(3), షోయబ్(2)కు చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి బైక్పై తీసుకెళ్లాడు. అనుమానం వచ్చిన హబీబున్నీసా పోలీసులను ఆశ్రయించారు.
మొబైల్ లొకేషన్ ఆధారంగా హైదరాబాద్ యాకత్పుర రైల్వేస్టేషన్ వద్ద ఉన్నట్టు గుర్తించారు. బాధితురాలితోపాటు ఆమె బంధువులను అప్రమత్తం చేసి అర్ధరాత్రి రఫీక్ను పట్టుకున్నారు. అతడి వద్ద పిల్లలు లేకపోవడంతో పోలీసులు నిలదీశారు. బహద్దూర్పురలో ఓ వ్యక్తి వద్ద పిల్లలను ఉంచినట్టు తెలిపాడు. పోలీసులు అక్కడికి వెళ్లి చిన్నారులను క్షేమంగా తీసుకొచ్చి తల్లికి అప్పగించారు. జడ్చర్లలో రఫీక్కు కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేయగా.. ముగ్గురు పిల్లలను రూ.9 లక్షలకు అమ్మకానికి పెట్టానని, గోవాకు తరలించనున్నట్టు చెప్పడంతో వారు కంగుతిన్నారు.