హైదరాబాద్, అక్టోబర్10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బుధవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల తిరోగమనం ఇప్పటికే ప్రారంభం కాగా, సోమవారం రామగుండం ప్రాంతం వరకు చేరుకున్నాయని పేర్కొన్నది. రెండు రోజుల్లో రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ పూర్తవుతుందని చెప్పింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది.
ఈ ఏడాది రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో జూన్లో ఆశించినంతగా వర్షాలు కురువలేదు. జూలై చివరి వారంలో వానలు దంచికొట్టగా, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఆగస్టులోనూ సరిగా వర్షాలు పడలేదు. సెప్టెంబర్లో అడపాదడపా వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో 18 జిల్లాల్లో అధిక వర్షపాతం, మిగిలిన జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.