Nizamabad | నవీపేట, ఆగస్టు 5: ఇద్దరు భార్యల పోరు భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడో భర్త. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం నిజాంపూర్లో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది. ఎస్సై యాదగిరిగౌడ్, స్థానికుల కథనం మేరకు.. నిజాంపూర్కు చెందిన కుర్మ మారుతి (42)కి, మాక్లూర్ మండలం కొత్తపల్లికి చెందిన మహిళతో పన్నెండేండ్ల క్రితం వివాహం జరిగింది. కూతురు పుట్టిన తర్వాత కాపురంలో గొడవలు మొదలయ్యాయి. పెద్దల సమక్షంలో ఇరువురు పరస్పర ఆమోదంతో విడాకులు తీసుకున్నారు. కూతురు పెద్ద అయిన తర్వాత తండ్రి మారుతి పెండ్లి చేసి ఇవ్వాలని ఒప్పందం కుదిరింది. ఆ వెంటనే ఆమె బిడ్డను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. కొద్దిరోజుల తర్వాత మారుతి మహారాష్ట్రకు చెందిన మహిళను రెండో పెండ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు.
మొదటి భార్య వచ్చి కూతురి పెండ్లి చేయాలని, లేదంటే ఎకరం భూమిలో వాటా కావాలని ఒత్తిడి తెచ్చింది. మొదటి భార్యకు ఆస్తి ఇస్తే తాను సంసారం చేయనని రెండో భార్య భర్తతో గొడవకు దిగింది. రెండ్రోజుల క్రితం ఇద్దరు పిల్లలను తీసుకొని ఆమె మహారాష్ట్రలోని పుట్టింటికి వెళ్లిపోయింది. ఇద్దరు భార్యల ఒత్తిడితో జీవితంపై విరక్తి చెందిన మారుతి శుక్రవారం రాత్రి తన పొలంలోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా దవాఖానకు తరలించారు.