రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై అధికార బీజేపీ, విపక్ష పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. ఏకగ్రీవం కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తుండగా.. ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలిపేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. విపక్షాలతో చర్చించే బాధ్యతను రాజ్నాథ్సింగ్, జేపీ నడ్డాకు బీజేపీ బాధ్యతలు అప్పగించింది. ఎన్నిక అనివార్యమైతే తమ అభ్యర్థికి ఓటు వేయించుకొనేందుకు 15 మంది కాంగ్రెస్ ఎంపీలపై బీజేపీ గురిపెట్టినట్టు సమాచారం. 25 మంది శివసేన ఎమ్మెల్యేలపైనా దృష్టిసారించినట్టు తెలిసింది.
రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం అధికార బీజేపీ, విపక్ష పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. అభ్యర్థిని ప్రకటించేందుకు, ఏకగ్రీవం చేయించుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు ఇటు.. బీజేపీ యత్నిస్తుండగా, అభ్యర్థి ఎంపిక చేసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఏకగ్రీవం కోసం కేంద్ర మంత్రి రాజ్నాథ్సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఆ పార్టీ బాధ్యతలు అప్పగించింది.
ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఇద్దరు సీనియర్ నేతలు అధికార ఎన్డీయే, ప్రతిపక్ష యూపీఏ భాగస్వామ్య పక్షాలతో సహా ఇతర ప్రతిపక్ష రాజకీయ పార్టీల నేతలు, స్వతంత్ర సభ్యులతో త్వరలో చర్చలు ప్రారంభిస్తారని పేర్కొన్నది. 2017లో రాష్ట్రపతి ఎన్నికల సమయంలో అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ను ఎంపిక చేసిన తర్వాత చివరి నిమిషంలో తమ వద్దకు చర్చలకు రావడంతో ప్రతిపక్ష పార్టీలు బీజేపీ తీరుపై విమర్శలు చేశాయి.
అటు కాంగ్రెస్ కూడా అభ్యర్థి ఎంపికకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. భావసారూప్య పార్టీలతో చర్చల కోసం పార్టీ సీనియర్ నేత, రాజసభ్యలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేకు సోనియాగాంధీ బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉండగా, అభ్యర్థి ఎంపికపై చర్చించేందుకు ఢిల్లీ రావాలని 22 మంది విపక్ష నేతలకు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే లేఖ రాశారు. 15న కాన్స్టిట్యూషన్ క్లబ్లో అభ్యర్థి ఎంపికపై చర్చిద్దామని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే హాజరు కావడం లేదు. పార్టీ నుంచి సీనియర్ నేత ఈ భేటీకి హాజరవుతారని శివసేన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఉండాలని పలు పార్టీలు కోరుతున్నాయి. ఆదివారం ముంబైలో ఆయనతో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ భేటీ అయ్యారు. అభ్యర్థిగా ఉండాలని పవార్ను కోరగా, ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఆరోగ్యం, వయసు రీత్యా తాను బరిలో నిలవలేనని స్పష్టం చేశారు. రెడ్ కార్పెట్పై నిల్చోవాలని, ఆర్మీ సెల్యూట్ స్వీకరించాలని, విదేశీ ప్రతినిధులను ఆహ్వానించాలని.. ఇవన్నీ చేసేందుకు ప్రస్తుతం తన వయసు, ఆరోగ్యం సహకరించటం లేదని తేల్చి చెప్పారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థికి ఓటు వేయించుకొనేందుకు 15 మంది కాంగ్రెస్ ఎంపీలపై బీజేపీ గురి పెట్టినట్టు తెలిసింది. మహారాష్ట్ర, హర్యానా, మధ్యప్రదేశ్లోని ఎమ్మెల్యేలపైనా ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ వ్యవహారం కాంగ్రెస్కు తలనొప్పిగా మారే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కొవిడ్తో దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలను కాపాడుకొనేందుకు పార్టీ పెద్దలు అప్రమత్తమయ్యారు. 25 మంది శివసేన ఎమ్మెల్యేలపై బీజేపీ దృష్టి సారించినట్టు తెలుస్తున్నది.