హైదరాబాద్ సిటీబ్యూరో, మే 2(నమస్తే తెలంగాణ): ఒకప్పుడు హైదరాబాద్ నగరాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన హెచ్ఎండీఏ.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో నిధులను సమకూర్చే కామధేనువులా మారింది. గతంలో లాభాలతో కళకళలాడిన ఇదే సంస్థ.. ఇప్పుడు అప్పులకుప్పగా మారుతున్నది. రూ.5,000 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంపై, చేతిలో ఉన్న ఆదాయ మార్గాలను సంస్థ అన్వేషిస్తున్నది. భారీ ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిన ఈ తరుణంలో, కీలకమైన మెట్రో స్వాధీనం కోసం నిధులు సమకూర్చే ఆర్థిక వనరుగా నిలిచింది. ఓ వైపు కీలకమైన ప్రాజెక్టులను పట్టాలెక్కించలేక, మరోవైపు ఆర్థిక వనరుల రూపకల్పనలో విఫలమై తిరోగమనం వైపు హెచ్ఎండీఏ అడుగులు వేస్తున్నది.
గత ప్రభుత్వ హయాంలో గ్రీన్సిటీగా, గ్లోబల్సిటీగా వెలుగొందిన హైదరాబాద్ నగరాభివృద్ధిలో హెచ్ఎండీఏ అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించింది. కానీ నేడు కాంగ్రెస్ అసమర్థ పాలనా తీరుతో మౌలిక వసతులు సమకూర్చుకోలేక కొట్టుమిట్టాడుతున్నది. భారీ ప్రాజెక్టులంటూ ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించిన ప్రభుత్వం.. వాటికి నిధులను సర్దుబాటు చేయలేక చేతులెత్తివేసింది. రూ.5 వేల కోట్ల సేకరణే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగాల్సి వచ్చింది. వచ్చే మూడు నెలల్లోగా ఆ భారీ నిధులను సమీకరించాలన్న రాష్ట్ర సర్కార్ సూచనలతో హెచ్ఎండీఏ సతమతం అవుతున్నది. ఆ నిధుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగాల్సిన పరిస్థితి ఇప్పుడు హెచ్ఎండీఏకు ఏర్పడింది.
సర్కార్ ఆశలకు అనుగుణంగా నగరంలో భూముల వేలంపైనే హెచ్ఎండీఏ గంపెడాశలు పెట్టుకొన్నది. నిరుడు నిర్వహించిన భూముల వేలం ద్వారా ఏకంగా రూ.5వేల కోట్లను సర్కార్ ఆర్జించింది. ముఖ్యంగా కోకాపేట, ఉప్పల్ భగాయత్ వంటి ప్రాంతాల్లో నిర్వహించిన వేలంలతో హెచ్ఎండీఏను సర్కార్ అక్షయపాత్రలా భావిస్తున్నది. వీటితోపాటే భూముల వేలం, లీజు వ్యవహారాలు, ఇతర ఆదాయ మార్గాలపై హెచ్ఎండీఏ దృష్టి పెట్టింది. హెచ్ఎండీఏ తన పరిధిలోని విలువైన ప్లాట్లు, ప్రభుత్వ భూములను గుర్తించే పనిలో పడింది. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని హెచ్ఎండీఏ లే అవుట్లలో ఉన్న మల్టీపర్పస్ ప్లాట్లను వేలానికి సిద్ధం చేస్తున్నారు. కోకాపేట ఫేజ్-3, బుద్వేల్, ఐటీ కారిడార్ సమీపంలో డిమాండ్ ఉన్న ఉన్న భూములను అమ్మి సొమ్ము చేసుకోవాలని భావిస్తున్నది. వీటితోపాటు హెచ్ఎండీఏ ఆధీనంలో ఆదాయాన్నిచ్చే భవనాల లీజు క్రమబద్ధీకరణ, ఎల్ఆర్ఎస్ వంటి పథకాల ద్వారా నిర్ధేశిత లక్ష్యాన్ని చేరుకోవాలని యోచిస్తున్నది.
ఇటీవల జరిగిన మెట్రో స్వాధీన ప్రక్రియలో హెచ్ఎండీఏ కీలకపాత్ర పోషించింది. సర్కార్ ఖజానా ఖాళీ కావడంతో వాటాల కొనుగోలు ప్రక్రియలో భాగంగా హెచ్ఎండీఏ సుమారు రూ.1,300 కోట్లను సమకూర్చింది. ఈ భారీ చెల్లింపుల కారణంగా సంస్థపై ఆర్థిక ఒత్తిడి మరింతగా పెరిగింది. లోటును పూడ్చుకోవడంతోపాటు, నిధులు సమకూరితే గానీ పనులను పట్టాలెక్కించలేని పరిస్థితి ఏర్పడింది. వచ్చే 3 నెలల కాలపరిమితిలో రూ.5వేల కోట్లు సాధించడం హెచ్ఎండీఏకు అతిపెద్ద సవాల్గా మారినా.. సర్కార్ ఆశల కోసం ఉన్న భూములను అమ్ముకోవాల్సిందేనన్న చర్చ నడుస్తున్నది.
సర్కార్ దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలతో, హెచ్ఎండీఏ కీలకమైన ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇందులో భాగంగా చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్, గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లు, బంజారాహిల్స్ నుంచి శిల్పా లే అవుట్ వరకు ప్రతిపాదించిన కీలక ఎలివేటెడ్ కారిడార్కు నిధుల కొరత శాపంగా మారింది. ఎలివేటెడ్ కారిడార్, గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్లు ఇంకా భూ సేకరణ దశలోనే ఉన్నాయి. కానీ గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్కు అరకొర నిధుల కేటాయింపుతో అభివృద్ధి కుంటుపడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.