హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని ప్రజాభవన్ (ప్రగతి భవన్) వద్ద బారికేడ్లను ఢీకొట్టిన కేసులో పోలీసులు ఎందుకు అతిశ్రద్ధ చూపుతున్నారని హైకోర్టు ప్రశ్నించింది. సాధారణ వ్యక్తులపై కేసు నమోదైనప్పుడు కూడా ఇదేవిధంగా వ్యవహరిస్తారా? అని నిలదీసింది.
ఈ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్, మరో ఇద్దరికి వ్యతిరేకంగా పోలీసులు జారీచేసిన లుకౌట్ నోటీసు అమలును నిలిపివేసింది. వారిని అరెస్టు చేయరాదని, సీఆర్పీసీలోని సెక్షన్ 41ఏ కింద నోటీసు జారీచేసి చట్టప్రకారం విచారణ చేయాలని స్పష్టం చేసింది. ఈ నెల 23లోగా పిటిషనర్లు పోలీసుల ఎదుట హాజరై విచారణకు సహకరించాలని జస్టిస్ కే లక్ష్మణ్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు.