హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడిగా అమర్నాథ్ను నియమిస్తూ ఆ సంఘం అంబుడ్స్మన్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. అమర్నాథ్ నియామకం చట్ట వ్యతిరేకమని ప్రకటించింది. అధ్యక్ష పదవికి 45 రోజుల్లోగా తిరిగి ఎన్నికలు నిర్వహించాలని హెచ్సీఏను ఆదేశించింది. అప్పటిదాకా ఉపాధ్యక్షుడికి అధ్యక్షుడి బాధ్యతలను అప్పగించాలని ఆదేశించింది. 2023లో జరిగిన హెచ్సీఏ ఎన్నికల్లో జగన్ మోహన్రావు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన అవినీతి ఆరోపణల కేసులో అరెస్టయ్యారు. దీంతో అధ్యక్ష పదవి ఖాళీగా ఉండటంతో, ఆ ఎన్నికల్లో కేవలం ఒక ఓటు తేడాతో ఓడిపోయిన అమర్నాథ్ను అధ్యక్షుడిగా నియమిస్తూ అంబుడ్స్మన్ ఫిబ్రవరి 2న ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నియామకాన్ని సవాల్ చేస్తూ సాగర్ క్రికెట్ క్లబ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని జస్టిస్ యారా రేణుక సోమవారం విచారణ చేపట్టారు. ఎన్నికైన అధ్యక్షుడు అరెస్టు కావడం లేదా పదవి ఖాళీ కావడం వంటి పరిస్థితుల్లో గత ఎన్నికల ఓట్ల ఆధారంగా రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థిని అధ్యక్షుడిగా నియమించే అధికారం అంబుడ్స్మన్కు లేదని తేల్చారు. కాగా, హెచ్సీఏ కార్యదర్శి పదవి నుంచి తనను తొలగించడాన్ని సవాలు చేస్తూ దేవరాజ్ దాఖలు చేసిన మరో పిటిషన్ విచారణార్హమేనని అన్నారు. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని హెచ్సీఏకు నోటీసులు జారీ చేస్తూ విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేశారు.