హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కులగణన చేపట్టే అంశంపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకొంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని హైకోర్టును కోరితే రిటైర్డ్ జడ్జిని ఇస్తామని చెప్పిందని, ఈ అంశంపై కూడా క్యాబినెట్లో, శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. గురువారం అసెంబ్లీలో సీఎం మీడియాతో చిట్చాట్లో పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులపై శాసనసభలో శ్వేతపత్రం పెడతారా లేదా? అనేది సంబంధిత శాఖ మంత్రి ప్రకటిస్తారని అన్నారు. మేడిగడ్డ మీద చర్చను పకదారి పట్టించడానికే కేసీఆర్ కేఆర్ఎంబీని తెరమీదికి తెచ్చారని విమర్శించారు. కృష్ణా బేసిన్లో ప్రజలు కేసీఆర్ను, ఆయన పార్టీని తిరస్కరించారని తెలిపారు.
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయన దగ్గరికి వెళ్లి కలిస్తే జరగని చర్చ, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనను కలిస్తే ఎందుకు వస్తున్నదని రేవంత్ ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ సభలో ఉండాలని కోరుకుంటున్నానని, ఆయన వస్తే తానే వెళ్లి కలుస్తానని స్పష్టం చేశారు. తొలి రోజు గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీఏసీ సమావేశానికి కేసీఆర్, కడియం శ్రీహరి వస్తారని స్పీకర్కు ఆ పార్టీ లెటర్ ఇచ్చిందని, తర్వాత కేసీఆర్ స్థానంలో హరీశ్రావు వస్తానంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. శాసనసభ వ్యవహారాల మంత్రిగా పదేండ్లు పనిచేసిన హరీశ్రావుకు ఆ మాత్రం తెలియదా? అని ప్రశ్నించారు. సోనియాగాంధీని లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరామని, తన నిర్ణయాన్ని తర్వాత చెప్తానని ఆమె బదులిచ్చారని వెల్లడించారు. ప్రతిపక్ష నేతకు అసెంబ్లీలో చాంబర్ కేటాయింపు అంశం స్పీకర్ పరిధిలోనిదని పేర్కొన్నారు. చాంబర్ ఇవ్వాలి కనుక ఇచ్చాం.. కానీ ఇక్కడే ఇవ్వాలని లేదు అని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఆయన భార్య, వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్రెడ్డి గురవారం రాత్రి సీఎం రేవంత్రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు.
అసెంబ్లీలో గురువారం అసక్తికర దృశ్యం కనిపించింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్తో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేకంగా కరచాలనం చేయడం ఆసక్తికరంగా మారింది. గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించుకొని వెళ్తున్న సమయంలో రేవంత్రెడ్డి కూడా సభా సంప్రదాయాన్ని అనుసరించి మర్యాదపూర్వకంగా ఆమె వెంట నడిచారు. అయితే సభ చివరలో ఉన్న రాజాసింగ్ గవర్నర్కు నమస్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ వెనకాల ఉన్న రేవంత్రెడ్డి ప్రత్యేకంగా రాజాసింగ్కు షేక్హ్యాండ్ ఇచ్చారు. మిగిలిన సభ్యులకు నమస్కరించుకుంటూ వెళ్లిన సీఎం.. రాజాసింగ్ ఒక్కరికి మాత్రం షేక్హ్యాండ్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.