హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ విద్యార్థులకే వైద్య విద్యలో సీట్లు దక్కేలా ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వులను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అదే సమయంలో.. ఆ నిబంధన మేరకు పిటిషనర్లకు మెడికల్ సీట్ల అడ్మిషన్లు నిరాకరించరాదని కూడా స్పష్టంచేసింది. మెడికల్ అడ్మిషన్లకు ముందు నాలుగేండ్లపాటు స్థానికంగా చదవలేదని లేదా ఇక్కడ నివాసం ఉండలేదన్న కారణంగా శాశ్వత నివాసితులకు స్థానిక కోటా నిరాకరించడం సమర్థనీయం కాదని పేర్కొంది. రాష్ట్ర విద్యార్థులు పదో తరగతి వరకు తెలంగాణలోనే చదివి ఇంటర్మీడియట్ వేరే రాష్ట్రంలో చదవడానికి గల కారణాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వం 2017లో జారీచేసిన జీవో 114 ప్రకారం.. తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా బదిలీ కావడం వల్ల వారి పిల్లలు వేరే ప్రదేశాల్లో చదువుకున్నా.. లేదా మధ్యలో కొన్నేండ్లపాటు మరోచోట విద్యాభ్యాసం చేసి ఇంటర్మీడియట్ ఇక్కడ చదువుకున్నా.. వారికి 85 శాతం స్థానిక రిజర్వేషన్ల కోటా కింద మెడికల్ అడ్మిషన్లు కల్పించేందుకు కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం నిరాకరించింది. ఈ జీవోను సవాల్ చేస్తూ పలువురు విద్యార్థులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ టీ వినోద్కుమార్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం 85 పేజీల తీర్పును వెలువరించింది. పిటిషనర్లు వారంలోగా సంబంధిత అధికారుల నుంచి శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలను తీసుకుని కాళోజీ వైద్య విశ్వవిద్యాలయానికి సమర్పించాలని, అలా అందుకున్న దరఖాస్తులను పరిశీలించిన అనంతరం స్థానిక రిజర్వేషన్ల కోటా కింద అర్హులైన వారికి మెడికల్ అడ్మిషన్లు కల్పించాలని కోర్టు ఉత్తర్వులు జారీచేసింది.
స్థానిక అభ్యర్థి అనే అంశంపై ప్రభుత్వం ఎక్కడా నిర్వచించలేదని, చట్టం కూడా చేయలేదని ధర్మాసనం పేర్కొంది. ‘మెడికల్ అడ్మిషన్ల నిబంధనల్లో రూల్ 3(III)(బీ)(ఎ) ఆఫ్ 2017 ప్రకారం మెడికల్ ఆడ్మిషన్లకు ముందు నాలుగేండ్లు స్థానిక విద్యాసంస్థల్లో విధిగా చదివి ఉండాలి. రూల్ 3(III)(బీ)(బి) ఆఫ్ 2017 ప్రకారం స్థానికంగా నివాసం ఉండాలి’ అంటున్న ఈ నిబంధనలు సమర్థనీయం కాదని పేర్కొంది. వీటి వల్ల మెడికల్ సీట్లు తెలంగాణ వారికే దక్కాలన్న ఆశయాన్ని సాధించలేరని తెలిపింది. ‘రాష్ర్టానికి చెందిన శ్వాశత నివాసితుల విద్య, నివాసం ఇక్కడే ఉండాలన్నది వారి చేతుల్లో లేదు. తల్లిదండ్రుల ఉద్యోగ బదిలీల కారణంగా వేరే రాష్ర్టాల్లో విద్య/నివాసం తప్పని పరిస్థితి. కాబట్టి రూల్ 3(III)(బి) ఆఫ్ 2017 రాజ్యాంగంలోని 14వ అధికరణానికి వ్యతిరేకం’ అని స్పష్టంచేసింది. అయితే, శాసనకర్తలు చెల్లని చట్టాలు చేయరని, తెలంగాణ విద్యార్థులకే వైద్య విద్య సీట్లు దక్కాలన్న రాష్ట్ర ప్రభుత్వ మహత్తర సంకల్పాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు పేర్కొంది.
శాసనం చేసే వారి లక్ష్యం స్థానికులకు రిజర్వేషన్లు కల్పించడమేనని, దీనిని గమనంలోకి తీసుకుని భాష్యం చెప్పాలని వ్యాఖ్యానించింది. ‘అందుకే నిబంధనను కొట్టేయడం లేదు. నిబంధనను కొట్టేస్తే.. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో సీట్ల ప్రవేశానికి దేశంలోని విద్యార్థులంతా అర్హులు అవుతారు. అందుకే ఆ నిబంధనను పరిగణనలోకి తీసుకోవడం లేదు. అయితే, ఆ నిబంధన రాష్ట్రంలోని శ్వాశత నివాసితులకు మాత్రం వర్తించదు. కాబట్టి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని వారికే స్థానికత వర్తించేలా సీట్ల కల్పనకు తెచ్చిన ప్రత్యేక నిబంధన ఆర్ 3710(2)(బి)(ii) మేరకు ఉండాలి. రాజ్యాంగంలోని 371-డి అధికరణాన్ని సుప్రీంకోర్టు సమీక్షించింది. అది రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి విరుద్ధంగా లేదని తేల్చింది. ఆ అధికరణాన్ని సమర్ధించింది. సురేఖ-కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు రాష్ట్రపతి ఉత్తర్వుల గురించి చర్చించలేదు. కాబట్టి రాష్ట్రపతి ఉత్తర్వుల చెల్లుబాటు అంశంపై పరిశీలన చేసే పరిధి తమకు (హైకోర్టు) ఉంది. సుప్రీంకోర్టు రాష్ట్రపతి ఉత్తర్వుల చెల్లుబాటును పరిగణనలోకి తీసుకోనందున ఈ కేసులో పిటిషనర్లు ఎలాంటి ఉపశమనానికి అర్హులు కాదనడం సబబుకాదు..’ అని తీర్పు చెప్పింది.
శాశ్వత నివాసితులే స్థానికులు
‘శాశ్వత నివాసితులైన విద్యార్థులను స్థానికులుగానే పరిగణించాలి. ఇందుకు అనుగుణంగా 2023-24 ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను భర్తీ చేయాలి. మంగళవారం తీర్పు వెలువడిన రోజు నుంచి వారంలోగా పిటిషనర్లు స్థానిక ధ్రువీకరణ పత్రాన్ని తీసుకొని కాళోజీ యూనివర్సిటీకి సమర్పించాలి. నిబంధన 2017లోని 3(III)(బి) ప్రకారం విద్యార్థులను స్థానికులుగా పరిగణించాలంటే అర్హత పరీక్ష (నీట్)కు ముందు నాలుగేండ్లు తెలంగాణలోనే చదివి ఉండాలని స్పష్టం చేస్తున్నది. ఇది రాజ్యాంగంలోని14ను ఉల్లంఘించేలా ఉన్నది. ఇలాంటి నిబంధనను తప్పుబడుతూ గతంలో సుప్రీంకోర్టు పలు కేసుల్లో ఉత్తర్వులు వెలువరించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శాశ్వత నివాసితులకు 3(III)(బి) వర్తించదు. పిటిషనర్లు ఆ నిబంధన కిందకు రారని కాళోజీ విశ్వవిద్యాలయం కూడా చెప్తున్నది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 95తో ఈ వ్యాజ్యానికి సంబంధం లేదు. హైదరాబాద్కు చెందిన పిటిషనర్లు ప్రశంస రాథోడ్, ఇతరులు శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం సమర్పించిన తరువాత వాళ్ల అర్హతలను బట్టి స్థానిక కోటా 85 శాతం కింద మెడికల్ సీట్ల ప్రవేశ అవకాశం కల్పించాలి’ అని ధర్మాసనం ఆదేశించింది.