హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): పలు మున్సిపాలిటీ చైర్మన్లకు జారీ అయిన అవిశ్వాస తీర్మానాలపై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. తెలంగాణ మున్సిపల్ చట్టం-2019 సెక్షన్ 37లో అవిశ్వాస తీర్మానం ఆమోదించడానికి సంబంధించిన విధానం లేదనే అప్పీల్ పిటిషన్లపై ప్రభుత్వ వైఖరి తెలియజేయాలని ఆదేశించింది. ప్రతివాదులైన పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్లతో పాటు సంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి-భువనగిరి, జనగామ కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది.
సదాశివపేట, ఆందోల్-జోగిపేట, జవహర్నగర్, జనగామ, ఆలేరు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలపై నోటీసులు జారీచేసింది. ఆయా మున్సిపల్ కార్పొరేషన్లల్లో జారీచేసిన అవిశ్వాస తీర్మానాల్లో సింగిల్ జడ్జి జోక్యం చేసుకోకపోవడంతో వాటి చైర్మన్లు అప్పీల్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టి స్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్కుమార్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వ వాదనల తర్వాత ఉత్తర్వులు ఇస్తామని, విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.