హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ‘గృహలక్ష్మి’ పథకం అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. లబ్ధిదారుల గుర్తింపు సహా మొత్తం ప్రక్రియను నిలిపివేయాలని అధి కారులను ఆదేశించింది.
గిరిజనుల హకుల పరిరక్షణకు చర్యలు చేపట్టకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారని, తద్వారా నిబంధనలకు విరుద్ధంగా గిరిజనేతరుల ఇండ్ల నిర్మాణానికి సాయం అందిస్తున్నారని ఆదివాసీ సేన దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డి శుక్రవారం విచారణ జరిపారు.
‘గృహలక్ష్మి’ లబ్ధిదారులను గ్రామసభ ద్వారా ఎంపిక చేయాలన్న నిబంధనను అధికారులు అమలు చేయడం లేదని, దీని వల్ల గిరిజనుల హక్కులకు విఘాతం కలుగు తుందని పిటిషనర్లు పేర్కొంటూ.. సంబంధిత జీవో 25ను కొట్టివేయాలని కోరారు. విచారణను న్యాయమూర్తి 16కు వాయిదా వేశారు.