హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల మెడికల్ కౌన్సెలింగ్లో ఏపీకి చెందిన ఓ విద్యార్థినికి వెబ్ఆప్షన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కాళోజీ వైద్య విశ్వవిద్యాలయానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2014 తర్వాత కొత్తగా ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లు 100 శాతం తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 72 జారీ చేసింది. కొత్త మెడికల్ కాలేజీల్లో ఏపీ విద్యార్థులకు అవకాశం లేకుండా కన్వీనర్ కోటా 15 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే కేటాయింపు చర్యను ప్రకాశం జిల్లాకు చెందిన గంగినేని సాయిభావన హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధే, జస్టిస్ టీ వినోద్కుమార్తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. దీనిపై ధర్మాసనం పైవిధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వెబ్ ఆప్షన్ మాత్రమే ఇచ్చామని, జీవోపై తుది తీర్పుకు లోబడి ఆమె అడ్మిషన్ ఉంటుందని స్పష్టం చేసింది. ఇదే తరహాలో దాఖలైన ఇతర వ్యాజ్యాలతో కలిపి ఈ నెల 9న విచారణ చేస్తామని ప్రకటించింది. రాష్ట్ర విభజన సమయంలో ఉన్న వైద్య కళాశాలల్లోని అన్ రిజర్వుడు సీట్లను తెలంగాణ, ఏపీ విద్యార్థులకు ఉంటాయని ప్రభుత్వ వాదన.
భూసేకరణ ప్రక్రియను నిలిపివేయండి: హైకోర్టు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఫార్మా సిటీకి సంబంధించిన భూసేకరణ ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అవార్డు ప్రకటన, పరిహారం డిపాజిట్ తదుపరి చర్యలను నిలిపివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఎం సుధీర్కుమార్ ఇటీవల తీర్పు వెలువరించారు. చట్టప్రకారం తమకు భూసేకరణ పరిహారం చెల్లించడం లేదంటూ మేడిపల్లి, కురిమిద్ద గ్రామస్థులు దాఖలు చేసిన వ్యాజ్యంలో తీర్పు చెప్పారు.