హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ పోస్టుల నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 6న జారీచేసిన డీఎస్సీ నోటిఫికేషన్లో మహిళలకు వర్టికల్ విధానంలో రిజర్వేషన్లు అమలుచేయాలన్న విద్యాశాఖ నిర్ణయాన్ని సవాలుచేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై జస్టిస్ మాధవీదేవి ఇటీవల విచారణ చేపట్టి శుక్రవారం మధ్యంతర ఆదేశాలిచ్చారు.
రాజేశ్కుమార్ దారియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో మహిళా రిజర్వేషన్ల అమలులో సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని తెలిపారు. రాష్ట్రంలో గ్రూప్- 1 పోస్టుల భర్తీ ప్రక్రియలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లను అమలు చేయాలని ఇదే హైకోర్టు తీర్పు చెప్పిందని న్యాయమూర్తి గుర్తుచేశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం డీఎస్సీ-23 నోటిఫికేషన్లో కూడా అదే విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. వాదనల తర్వాత హైకోర్టు, కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను 15కు వాయిదా వేసింది.