Telangana | హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో పంటల సాగు జోరుగా సాగుతున్నది. ఇప్పటికే సాగు విస్తీర్ణం కోటి ఎకరాలకు చేరువైంది. బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 96 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయశాఖ వెల్లడించింది. గత వానకాలం సీజన్లో ఈ సమయానికి 83.43 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అంటే గతంతో పోల్చితే ప్రస్తుతం సుమారు 13 లక్షల ఎకరాల్లో అధికంగా పంటలు సాగవడం విశేషం. నెలాఖరు వరకు ఇదే జోరు కొనసాగితే గత సాగు రికార్డులు బద్దలు కావ డం ఖాయమని అధికారులు భావిస్తున్నారు. గత వానకాలంలో రికార్డు స్థాయి లో 1.36 కోట్ల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. పత్తి సాగు కూడా కాస్త అటు ఇటుగా నిరుడు మాదిరిగానే సాగవుతున్నది. ఇప్పటివరకు 44.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగైనట్టు వ్యవసాయశాఖ వెల్లడించింది. 5.02 లక్షల ఎకరాల్లో మక్కజొన్న, 4.43 లక్షల ఎకరాల్లో సోయాబీన్, 4.55 లక్షల ఎకరాల్లో కంది పంటలు సాగయ్యాయి.
వరి పంటజోరు…
భారీ వర్షాలకుతోడు అనుకూల వాతావరణం ఏర్పడటంతో వరిసాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే 36 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. నిరుడు ఇదే సమయానికి 21.40 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగైంది. గతంతో పోల్చితే ఇప్పటికే 15 లక్షల ఎకరాల్లో అధికంగా వరి సాగైంది. ఈ సీజన్లో పుష్కలమైన వర్షాలతో వరి సాగుకు అత్యంత అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. సమయానికి భారీ వర్షాలు కురవడంతో రైతులు సాగుకు మొగ్గుచూపుతున్నారు. ఈ సీజన్లో రికార్డు స్థాయిలో వరి సాగ య్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత సీ జన్లో రికార్డు స్థాయిలో 64.54 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఇప్పుడు ఈ సాగు ను అధిగమించే సూచనలు కనిపిస్తున్నాయి.